ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. మరో 40 కి.మీ పెంపు, అక్కడి వరకు రహదారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 09:33 PM

హైదరాబాద్-విజయవాడ హైవే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉన్న విషయం తెలిసిందే. దేశంలో అత్యంత రద్దీగా ఉండే నేషనల్ హైవేల్లో ఇదీ ఒకటి. ప్రతి నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏపీ-తెలంగాణలకు చెందిన ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న హైవేపై నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ రహదారిపై వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హైవే విస్తరణకు రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదన పెట్టగా.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


అయితే ఈ రహదారి మరింత పెరగనుంది. మరో 40.మీ అదనంగా రహదారి విస్తరించనున్నట్లు సమాచారం. ఏపీలోని గొల్లపూడి వరకు విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది. తొలుత ఈ రహదారిని హైదరాబాద్‌ శివారు దండు మల్కాపూర్‌ నుంచి ఏపీలోని జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలనుకున్నారు. కాగా, ప్రస్తుతం గొల్లపూడి వరకు పెంచాలని డిసైడ్ అయ్యారు. ఈ విస్తరణ పనులు చేపట్టేందుకు వీలుగా 181.5 కి.మీ డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేశారు. అందుకు ఈనెల 24వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ టెండర్లను ఆహ్వానించింది.


ఇక హైదరాబాద్- విజయవాడ హైవేలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్‌ స్పాట్స్‌ను అధికారులు ఇప్పటికే గుర్తించారు. రూ.325 కోట్లతో ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అండర్‌పాస్‌లు, వంతెనలు నిర్మించేందుకు గాను పనులను చేపట్టింది. తాజా టెండర్‌లో ఈ పనులను మినహాయించినట్లు కేంద్రం వెల్లడించింది. ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ వద్ద నిర్మాణంలో ఉన్న బైపాస్‌ రోడ్డు పనులను కూడా తాజా టెండరు పరిధి నుంచి కేంద్రం తొలగించింది.


జగ్గయ్యపేట నుంచి గొల్లపూడి మార్గంలో తరచూ ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తున్నాయని అధికారులు గుర్తించారు. ఈ రహదారిని 6 వరుసలకు విస్తరిస్తే.. ట్రాఫిక్ రద్దీ తగ్గి వాహనాల రాకపోకలకు ఈజీ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డీపీఆర్‌ తయారీ ప్రక్రియకు కన్సల్టెంట్‌ కాంట్రాక్టర్ ఎంపిక ప్రక్రియకు అక్టోబర్ నెల చివరి వారం నుంచి అధ్యయనం చేపట్టాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఈ పనులు పట్టాలెక్కి ఆరు వరుసల రహదారి అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గటంతో పాటుగా.. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు మరింత మెరుగవుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa