తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పలువురు సీనియర్ పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. పూర్తిగా రాష్ట్రంలోని పలువురు కీలక నేతలే టార్గెట్గా జరిగినట్టు బయటకు వచ్చింది. అప్పటి.. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరులు, స్నేహితులు, అనుచరుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టుగా బయటికి వచ్చింది.
వారితో పాటు.. అప్పుడు బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫోన్తో పాటు, ఆయన గన్ మెన్, పీఆర్ఓ, సెక్యూరిటీ గార్డుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టుగా విచారణలో బయటకొచ్చింది. మొత్తంగా.. 4 నెలల్లో 4500 ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా.. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో 80 శాతానికి పైగా ఎయిర్ టెల్ కస్టమర్లే ఉన్నట్టు సమాచారం. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు కూడా కాంగ్రెస్కు చెందిన 190 మంది ఫోన్లను.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రణీత్ రావు ట్యాప్ చేయించినట్టుగా తెలుస్తోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత.. ట్యాప్ చేసిన 340 జీబీకి చెందిన సమాచారాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్టు వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో నిందితుడైన తిరుపతిరావు హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇరుపక్షాల వాదనలు విని తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు పూర్తయినందున.. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ తిరుపతి రావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేశారు.
కోర్టుకు సమర్పించిన కాల్డేటా ప్రకారం తిరుపతి రావు ఎలాంటి నేరానికి పాల్పడలేదని.. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయడం తప్ప ఎలాంటి తప్పు చేయలేదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే తిరుపతి రావు నుంచి కావాల్సిన సమాచారం సేకరించినందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
అయితే.. నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన అధికారుల్లో తిరుపతి రావు ఒకరని.. స్పెషల్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సూచనల మేరకే ఫోన్ ట్యాపింగ్క పాల్పడ్డారని పీపీ తెలిపారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభాకర్ రావుతో కలిసి ఆధారాలను ధ్వంసం కూడా చేశారని ఆరోపించారు. కీలకమైన సమాచారాన్ని తగలబెట్టారని.. అలాంటి వ్యక్తికి ఈ దశలో బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపులా వాదనలను విన్న న్యాయస్థానం.. తీర్పు వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa