ఒకే కాలేజీకి చెందిన రెండు బస్సులు ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. మెదక్ జిల్లాలో నర్సాపూర్ సమీపంలో శుక్రవారం (సెప్టెంబర్ 27) ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఓ బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో 20 విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులు వేగంగా వస్తూ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదస్థలి భీతావహంగా మారింది. ప్రమాదం తర్వాత ఇద్దరు డ్రైవర్లూ బస్సుల ముందు భాగంలో ఇరుక్కుపోయారు. స్థానికులు, పోలీసులు చాలాసేపు శ్రమించి బయటకుతీశారు.
నర్సాపూర్ పట్టణ శివారులోని ఎల్లమ్మ గుడి సమీపంలో క్లాసిక్ గార్డెన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బీవీఆర్ఐటీ కాలేజీకి చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఓ ఆటోను తప్పించే క్రమంలో బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సుల్లో 100 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు.
గాయపడిన వారిని నర్సాపూర్, సంగారెడ్డి ఆస్పత్రులకు తరలించారు. తీవ్ర గాయాలైన వారిని హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన డ్రైవర్ను నాగరాజు (50)గా గుర్తించారు. నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సై లింగం.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదం కారణంగా నర్సాపూర్ - సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఇరువైపులా 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు, కాలేజీ సిబ్బంది కలిసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
కాగా, తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల కారణంగా సగటున 20 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లకు కారణం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారుల లైసెన్స్లు రద్దు చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ శాఖా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మోటారు వాహన చట్టం కింద ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారి లైసెన్సులు రద్దు చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa