ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాపింగ్ చేస్తుండగా గుండెపోటు.. యువకుడి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 07:24 PM

చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఓ షో రూమ్‌లో దుస్తులు కొనేందుకు వెళ్లిన 37 ఏళ్ల ఓ వ్యక్తి.. షాపింగ్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ సమీపంలో జాకీ షో రూమ్‌లో బుధవారం (అక్టోబర్ 2) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన వ్యక్తిని కలాల్ ప్రవీణ్ గౌడ్ (37)గా గుర్తించారు. అతడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.


ప్రముఖ కంపెనీ హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న 40 ఏళ్ల ఓ వ్యక్తి కార్యాలయంలో వాష్‌రూమ్‌లో కుప్పకూలి మృతి చెందిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. రెండు రోజుల కిందట నాగ్‌పూర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. కిందటి వారం లక్నోలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగి సదాఫ్ ఫాతిమా అనే మహిళ బ్యాంకులోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు.


కొన్నేళ్ల కిందటివరకూ 60 ఏళ్లు పైబడిన వారిలో గుండెపోటు వచ్చేది. కానీ, గత కొన్నేళ్లుగా.. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం అనంతరం 20 ఏళ్ల లోపు వారు కూడా గుండెపోటుకు గురై మరణిస్తున్న ఘటనలను చూస్తున్నాం. అమెరికాలో స‌గ‌టున 45 ఏళ్ల వయసువారు గుండెపోటు బారిన పడుతుంటే, భార‌త్‌లో మాత్రం సగటున 35 ఏళ్ల వ‌య‌సులోనే గుండెపోటు వ‌స్తోంది.


దేశంలో చిన్నా, పెద్దా అనే వ్యత్యాసం లేకుండా.. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్లు హార్ట్ ఎటాక్ బారిన పడటానికి ప్రధాన కారణం.. పని ఒత్తిడి, నిద్రలేమి, మారిన ఆహారపు అలవాట్లు కారణమని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్ టైం పెరుగుతుండటం వల్లే చిన్న వయసులోనే గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయని హైదరాబాద్‌‌లోని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ సాయి రవిశంకర్ తెలిపారు.


ఆఫీసుల్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపై 10 గంటలకు పైగా పనిచేసే వాళ్లకు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్ రవిశంకర్ హెచ్చరించారు. సెల్ ఫోన్లను, టీవీని కూడా ఎక్కువగా చూడొద్దని ఆయన హెచ్చరించారు. లేదా ఇవన్నీ కలిపి 8 నుంచి 10 గంటలు మించినా రిస్కేనని చెబుతున్నారు. మొబైల్, ల్యాప్‌టాప్‌, టీవీ చూడటం.. వీట‌న్నింటినీ కలిపి ‘స్క్రీన్ టైం’ అని అంటారని ఆయన చెప్పారు. దీనికి తోడు ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌ల నుంచి పిజ్జాలు, బ‌ర్గర్లు, ఇత‌ర మాంసాహార పదార్థాలను ఆర్డర్ చేసుకొని తినడం కూడా గుండెకు ముప్పు చేస్తోందని డాక్టర్ రవిశంకర్ వివరించారు. ఇవన్నీ తగ్గించి రోజూ కనీసం అర గంట వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa