ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్పంచ్ ఎన్నికల వేళ గుడ్‌న్యూస్.. ఎంతమంది పిల్లలున్నా పోటీకి అవకాశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 07:26 PM

స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని ఎప్పటినుంచో వస్తున్న డిమాండ్లకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేసింది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ‌లాంటి స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి ముగ్గురు బిడ్డలు ఉంటే అనర్హులు అవుతారనే నిబంధన ఉండగా.. ఆ నిబంధనను తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ తొలగించింది. ఇటీవల సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. దీనికి సంబంధించి వీడియోను రిలీజ్ చేశారు.


గతంలో సర్పంచ్ సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్న అభ్యర్థులు పోటీ చేయడం నిషేధం ఉండేది. అయితే సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ముగ్గురు లేదా ఆపై ఎంతమంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు అవుతారు.


2019లో తీసుకువచ్చిన మున్సిపల్‌ చట్టం ప్రకారం ఎంతమంది పిల్లలు ఉన్నా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేవని ప్రభుత్వం చెబుతోంది. అయితే స్థానిక సంస్థల అభ్యర్థులకు ఏ ఏ సందర్భాల్లో ఇందులో మినహాయింపులతో కూడిన వెసులుబాట్లు లభిస్తాయి అనే విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంది. గతంలో పంచాయతీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థికి గరిష్ఠంగా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలని.. అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు అనర్హులు అవుతారని తీసుకువచ్చిన చట్టం 1994 మే 30వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తేదీకి ముందు ఎంత మంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు అవుతారు. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఒక సంవత్సరంలోగా అంటే 1995 మే 29వ తేదీ లోగా మూడో బిడ్డ పుట్టినా అనర్హులు కాకుండా మినహాయింపును ఇచ్చారు. 1995 మే 30వ తేదీ తర్వాత పుట్టిన పిల్లలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.


ఇక దత్తతకు సంబంధించిన పిల్లలు కూడా అసలు తల్లిదండ్రుల లెక్కలోనే ఉంటారు. ఈ మేరకు 2006లో హైకోర్టు కూడా తీర్పు వెలువరించింది. అంటే ఒక అభ్యర్థికి ముగ్గురు పిల్లలు ఉండి ఒకరిని దత్తత ఇచ్చేసినా వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు. ఇక అభ్యర్థి మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు.. రెండో భార్య ద్వారా మరో బిడ్డ ఉన్నా వారు అనర్హులుగానే లెక్కిస్తారు. నామినేషన్ వేసే నాటికి ముగ్గురు పిల్లలు ఉండి.. పరిశీలన జరిగే రోజుకు అందులో ఒకరు చనిపోయినా వారు అర్హులు అవుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa