తెలంగాణలో మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. జీరో టికెట్ తీసుకొని రాష్ట్ర నలుమాలలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయెుచ్చు. గ్రేటర్ పరిధిలో గతంలో రోజుకు 12 లక్షల మంది ప్రయాణిస్తే పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య దాదాపు 30 లక్షలకు చేరుకుంది. దీంతో బస్సులో కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండట్లేదు. పెరిగిన రద్దీతో పాత బస్సులు కూడా మెురాయిస్తున్నాయి. ఓవర్ లోడ్తో బస్సులు ముందుకు కదలట్లేదు.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్డినరీ బస్సుల రూపు మార్చేందుకు సిద్ధమైంది. పాత బస్సుల స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు రెడీ అవుతున్నారు. దసరా పండగ లోపే వీటిని రోడ్డెక్కించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్డినరీ బస్సులకు విభిన్నంగా ఏసీ బస్సుల రూపంలో ఇవి న్యూ లగ్జరీ లుక్తో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఏసీ, నాన్ ఏసీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండగా.. తాజాగా ఆర్టీనరీ బస్సులు కూడా విద్యుత్వే వాడనున్నారు. కొత్తగా తీసుకొచ్చే ఎలక్ట్రిక్ బస్సులను ఏ మార్గాల్లో తిప్పాలన్న అంశంపై అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు.
మెుత్తంగా 100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి ఆర్డినరీలుగా నడపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో భాగంగా తొలి విడతగా 10 బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 102 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. వీటికి అదనంగా మరో 438 సమకూర్చుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపడుతోంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల కోసం రూ.17 కోట్లు వెచ్చిస్తోంది. ప్రస్తుతం 102 ఎలక్ట్రిక్ బస్సుల్లో 77 ఏసీ, 25 నాన్ ఏసీ బస్సులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం చేయవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa