హైదరాబాద్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న బాధితుల బాధ తనకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇన్నేళ్లు ప్రతిపక్షంలో ఉండి.. అలాంటి ఎందరి బాధలనో చూసే ఇంత దూరం వచ్చామని గుర్తు చేశారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకట స్వామి 95వ జయంతి కార్యక్రమాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించగా.. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
మూసీ బాధితులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత వాతావరణంలో బతుకులు వెళ్లదీస్తున్న మూసీ నిర్వాసితులకు మంచి జీవితాలు అందించేందుకు.. ప్రణాళికలు రచించి ఇవ్వాలని వాటిని ప్రభుత్వం అమలు చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకున్న దాంట్లో 10 శాతం ఇచ్చిన వారి బతుకులు బాగుపడతాయన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1500 కోట్లు ఉన్నాయని.. మూసీ నిర్వాసితులపై ప్రేమ ఉంటే అందులో నుంచి 500 కోట్లు ఇవ్వాలన్నారు. గజ్వేల్లో 1000 ఎకరాల్లో ఉన్న ఫాంహౌస్లో కొంత స్థలం, జన్వాడలో ఉన్న 50 ఫాంహౌస్లో కొంత స్థలం ఇస్తే.. వారికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని తెలిపారు.
ఈ క్రమంలోనే.. మూసీ బాధితుల కోసం ఏం చేయాలన్న అంశంపై ఓ కమిటీ వేద్దామని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ కమిటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ను సభ్యులుగా పెడదామని పేర్కొన్నారు. వీళ్లంతా కలిసి చర్చించి.. ఆ పేదలకు ఎలాంటి న్యాయం చేయాలన్న అంశంపై సూచనలు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పేదవారికి మేలు చేసేందుకు ఓ కమిటీ వేద్దామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ప్రభుత్వం కూర్చొని పేదలకు ఏం చేద్దామో ఆలోచన చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
మూసీ ఒడ్డున ఉన్న పేదలకు మంచి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం అవసరమైతే.. మలక్ పేటలో ఉన్న రేసు కోర్టును నగర శివారులోకి తరలిద్దామన్నారు. అక్కడ ఇందిరమ్మ ఇండ్లు కట్టించి పేదలకు పంచుదామన్నారు. దాంతో పాటు.. అంబర్ పేటలో ఉన్న పోలీస్ అకాడమీని కూడా తరలించి.. సుమారు 100 ఎకరాల్లో పేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు కట్టించి.. వారికి మంచి జీవితాలు ఇద్దామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమం అయిపోగానే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మూసీ నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యతలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్కు అప్పగించారు. బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలన్న దానిపై అందిరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa