ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్తీ నీళ్లు తాగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు గ్రామస్థులు,,,,50 మంది ఆస్పత్రిపాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 06:39 PM

దసరా పండుగ వేళ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేటలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే గ్రామంలో 30 మందికి పైగా స్థానికులు అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు. ఇద్దరు మృతి చెందారు. అయితే.. ఇందుకు కారణం ఆ గ్రామస్థులు ఓ బావి నీటిని తాగటమేనని తెలుస్తోంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. సంజీవరావుపేటలో గత 3 రోజులుగా మిషన్ భగీరథ నీరు రావట్లేదు. దీంతో.. ఆ గ్రామస్తులంతా ఊర్లో ఉన్న ఓ బావి నీటినే తాగుతున్నారు. దీంతో వారిలో ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఒకరి తర్వాత ఒకరికి ఇలా.. సుమారు 50 మంది వరకు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో.. వారందరినీ హుటాహుటిన నారాణయఖేడ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.


అయితే.. పరిస్థితి విషమించటంతో ఇద్దరు మృతి చెందారు. మహేష్ అనే 22 ఏళ్ల యువకుడు, సాయమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు విడిచారు. మిగతావారిలోనూ పలువురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం పోలీసులకు తెలియజేయటంతో.. సంబంధిత అధికారులతో హుటాహుటిన గ్రామానికి చేరుకుని.. వాళ్లు తాగిన బావి నీళ్ల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు.. గ్రామంలోనే వైద్యాధికారులు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అయితే.. ఆ బావి నీళ్లు కలుషితం అయిన కారణంగానే ఇదంతా జరిగినట్టుగా భావిస్తున్నారు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు మూడు రోజులుగా ఎందుకు నిలిపి వేశారన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. బావి నీరు కలుషితంగా ఉన్నా.. వేరే మార్గమేమీ లేక వాటినే తాగాల్సివచ్చిందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ అంతటా తాగునీరు సరఫరా చేసేందుకు.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం.. మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను శుద్ధి చేసి రాష్ట్రమంతటా తాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టును కూడా రేవంత్ రెడ్డి సర్కార్ సరిగ్గా నిర్వహించలేకపోతుందని మండిపడ్డారు.


సంజీవరావుపేటలో కలుషిత నీరు తాగి గ్రామస్థులు అస్వస్థతకు గురికావటంతో పాటు ఇప్పటికే నమోదైన మరణాలు ముమ్మటికీ రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యమేనని ఆరోపించారు. మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, చికిత్స పొందుతున్న వారికి తగిన సాయం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో మరెక్కడా ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa