ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలయ్ బలయ్‌లో కాంగ్రెస్, బీజేపీ నేతల పరస్పర కౌంటర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 06:51 PM

ప్రతిసారి నిర్వహించినట్టుగానే.. ఈసారి కూడా దసరా తర్వాతి రోజున హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఒకే వేదిక మీదికు తీసుకొచ్చే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ.. 19 ఏళ్లుగా దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తోంది. అయితే.. గతంలో దత్తాత్రేయనే స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా.. కొన్నేళ్లుగా ఆయన కుమార్తె విజయలక్షి ఈ అలయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి నిర్వహించిన అలయ్ బలాయ్ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరవగా.. సీపీఐ నారాయణ బైకాట్ చేశారు.


అయితే.. ఈ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమర్శల విషయంలో ఒకరిపై ఒకరు.. స్టేజిపైనే కౌంటర్లు వేసుకున్నారు. ముఖ్యంగా.. ఈ అలయ్ బలయ్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలు హద్దుమీరుతున్నాయని గుర్తు చేసిన కిషన్ రెడ్డి.. నాయకుల ప్రసంగాల్లో, భాషలో మార్పు రావాలని ఆకాంక్షించారు. విమర్శించుకుందాం కానీ.. ప్రజలు అసహ్యించుకునేలా మాట్లాడకండి అంటూ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడు ఘర్షణ పడొచ్చు కానీ.. ఎన్నికలయ్యాక ప్రజల శ్రేయస్సే ముఖ్యమని హితవు పలికారు. పార్టీలు విమర్శించుకుంటున్న విధానాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. పరోక్షంగా కాంగ్రెస్ నాయకులపై కౌంటర్లు వేశారు.


అయితే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇన్ డైరెక్టుగా కౌంటర్ వేశాడు. రాజకీయాల్లో భాష ముఖ్యమని.. వేరేవాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్నది నిజనేనని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. అయితే.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడకుండా స్వీయ నియంత్రణ అవసరమంటూ కౌంటర్ వేశారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మాట్లాడేలా దత్తాత్రేయ చొరవ చూపాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్.


మరోవైపు.. ఈ కార్యక్రమంలో పాల్గొ్న్న సీఎం రేవంత్ రెడ్డి.. రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు అలయ్ బలయ్ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని తెలిపారు. ఉద్యమంలో జేఏసీ ఏర్పడేందుకు అలయ్ బలయ్ కీలక పాత్ర పోషించిందని చెప్పుకొచ్చారు. 19 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ కుటుంబం దిగ్విజయంగా నిర్వహింటంపై సీఎం ప్రశంసలు కురిపించారు. దసరా అంటే జమ్మిచెట్టు.. పాలపిట్ట గుర్తొస్తే... అలయ్ బలయ్ అంటే దత్తాత్రేయ గుర్తుకు వస్తారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa