ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారు నడిపిన గలాబీ దళపతి కేసీఆర్,,,,పక్కన యువనేత పట్లోల్ల కార్తీక్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 10, 2024, 07:19 PM

కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తిరిగి యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. శనివారం (నవంబర్ 10) గజ్వేల్‌లోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో పాలకుర్తి నియోజకవర్గం నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. హైడ్రా కూల్చివేతలు, సీఎం రేవంత్ రెడ్డి విమర్శలపై స్పందించారు. త్వరలో జిల్లాల యాత్రలు చేసే అవకాశం ఉన్నట్లు బీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఎర్రవల్లి ఫాం హౌస్‌లో కారు నడుపుతూ కేసీఆర్ కనిపించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, చేవెళ్ల యువనేత పట్లోల్ల కార్తీక్ రెడ్డిని పక్కన కూర్చో బెట్టుకొని కారు నడిపారు కేసీఆర్. ఫామ్ హౌస్‌లో సాగవుతున్న పంట పొలాలను పరిశీలించి, వాటి గురించి కార్తీక్ రెడ్డికి వివరించినట్లు తెలుస్తోంది.


కేసీఆర్ నడిపిన కారు ‘మెర్సిడెస్ బెంజ్’ అని తెలుస్తోంది. వైట్ కలర్‌లో కారు రాయల్‌గా కనిపిస్తోంది. ఈ ఏడాది జులైలో కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపిన సంగతి తెలిసిందే. డాక్టర్ల సూచనతో నాడు ఆయన తన ఫాం హౌస్‌లో వ్యాన్ నడిపారు. ఒంటరిగా కాసేపు వ్యాన్‌లో కలియతిరిగారు. గత ఏడాడి డిసెంబర్ 8న అర్ధరాత్రి ఇంట్లో కాలు జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. యశోదా ఆస్పత్రిలో డాక్టర్ల చికిత్స అనంతరం కోలుకున్న కేసీఆర్.. ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.


తాజాగా కేసీఆర్ కారు నడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టైగర్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ‘కారు మాదే.. నడిపేది మేమే’ అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. ‘ఈసారి కారు జోరును అడ్డుకోలేరు’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.


గిరిజన బిడ్డ కుటుంబానికి కేసీఆర్ రూ. 3 లక్షల సాయం


మూడు రోజుల కిందట పాలకుర్తి పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న గిరిజన బిడ్డ లకావత్ శ్రీనివాస్ నాయక్ కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం చేశారు కేసీఆర్. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో శ్రీను నాయక్ తల్లిదండ్రులకు చెక్ అందించారు. వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కేసీఆర్.


పోలీస్ స్టేషన్లో న్యాయం జరగడంలేదంటూ పోలీసుల ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీను నాయక్. తీవ్రమైన కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ‘పాలకుర్తి సీఐ, ఎస్ఐలే.. నా చావుకు కారణం’ అంటూ ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.


‘ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి. నిర్మాణాత్మకంగా పనిచేయాలి. కూలగొట్టడం కాదు.. నిలబెట్టాలి’ అని కేసీఆర్ అన్నారు. పరోక్షంగా హైడ్రా కూల్చివేతలను ఖండించారు. ‘ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారుగా.. మాకూ మాట్లాడటం వచ్చు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి కేసీఆర్ అన్నారు.


సినీ నిర్మాత, ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ పారుపాటి శ్రీనివాస్, ఆర్టిస్ట్ రవితేజ.. శనివారం ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. పార్టీ నాయకులు, శ్రేణులు కష్టపడి పనిచేయాలని, వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం తమ పార్టే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ చెప్పారు. ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమవుతోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa