తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి అమ్మాపురం చేరుకున్న రేవంత్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎం రేవంత్కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని బహుకరించారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహా ఉన్నారు.
దర్శనం కంటే ముందు.. కురుమూర్తి స్వామి దేవాలయానికి సమీపంలో రూ. 110 కోట్లతో చేపట్టనున్న ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. మంత్రులతో కలిసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏడుకొండల మధ్యలో ఉన్న కాంచనగుహలో కొలువుదీరిన కురుమూర్తి ఆలయానికి చేరుకునేందుకు ప్రస్తుతం సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. కురుమూర్తి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.110 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో నేడు ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్ పనులు ప్రారంభించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం రేవంత్.. కురుమూర్తి స్వామి దయతోనే తాను సీఎం అయినట్లు చెప్పారు. ఈ జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక సీఎం ఉన్నారని.. జిల్లాను విశేషంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా ప్రజలకు అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు..
తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే జాతరలలో కురుమూర్తి జాతర కూడా ఒకటి. పేదల తిరుపతిగా కురుమూర్తి ఆలయాన్ని పిలుస్తుంటారు. ప్రస్తుతం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం (నవంబర్ 9) తెల్లవారుజామున ఉత్సవమూర్తులను పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చిన అర్చకులు శాస్త్రోక్తంగా చక్రస్నానం పూర్తి చేసి సప్త వాహన సేవలు నిర్వహించారు.
అనంతరం భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేసి ఉద్దాల మండపంలో పాదుకల ఆశీర్వాదం తీసుకొన్నారు. ఆ తర్వాత కురుమూర్తిస్వామితో పాటు లక్ష్మిదేవి, చెన్నకేశవస్వామి, ఆంజనేయస్వామిలను దర్శించుకొని మెుక్కులు చెల్లించుకున్నారు. కొండ దిగువన మట్టి కుండలో నైవేద్యం వండి దాసంగాలు సమర్పించారు. ఉత్సవానికి వచ్చిన భక్తులు, యాత్రికులు జాతర మైదానంలో రాత్రి బసకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa