ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీ విస్తరణ షురూ.. ఇక అక్కడి భూములకూ మంచి డిమాండ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 22, 2024, 07:16 PM

హైదరాబాద్ మహానగర పరిధిని మరింత పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే.. గ్రేటర్ హైదరాబాద్ శివారులో ఉన్న పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ను ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించే క్రమంలో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోగా.. తొలిదశలో శివారు మున్సిపాలిటీల్లో 51 గ్రామాలను కలిపేందుకు 2 నెలల క్రితమే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేసింది. అయితే.. ఈ ఆర్డినెన్స్‌కు అనుగుణంగా.. మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారులోని మున్సిపాలిటీల్లోకి అక్కడున్న సమీప గ్రామపంచాయతీల విలీన ప్రక్రియ ప్రారంభమైంది.


ఈ విలీన ప్రక్రియలో భాగంగా.. గ్రామ పంచాయతీల రికార్డులు, భూములను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులను మున్సిపాలిటీల్లోని వార్డుల ఖాతాల్లోకి చేర్చుతున్నారు. ప్రాపర్టీ ట్యాక్సులు వసూలు చేస్తున్నా.. ఆయా గ్రామ పంచాయతీల పేర్లను సాఫ్ట్‌వేర్‌లో ఎక్కించకపోవటంతో.. ఆన్‌లైన్‌ ద్వారా ట్యాక్స్ చెల్లించటం సాధ్యం కావట్లేదు. అయితే.. ఇప్పుడు మున్సిపాలిటీల్లో విలీనమవుతుండటంతో వ్యవస్థ పూర్తిగా మారనుంది. ఇక ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న వాళ్లంతా.. మున్సిపాలిటీ వ్యవస్థలోకి వెళ్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు.. ఆయా గ్రామాల్లో ఉన్న భూములకు ఇన్ని రోజులూ అంతంతమాత్రంగానే ధరలు పలగా.. ఇప్పుడు మున్సిపాలిటీలో కలుపుతుండటంతో.. జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుండటంతో అక్కడి భూములకు మంచి డిమాండ్ రానుంది. దీంతో.. ఆ భూముల ధరలరు రెక్కలు రానున్నాయి. ఈ క్రమంలో.. అక్కడి ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.


ఉద్యోగులు కూడా పురపాలక శాఖ పరిధిలోకి..


ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులుగా విధులు నిర్వహించిన ఉద్యోగులు.. నేరుగా పురపాలక శాఖ అధికారులుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ వారు విధులు నిర్వహించిన సంవత్సరాలను సర్వీసుగా పరిగణించనున్నార. గ్రామ పంచాయతీల్లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో విధులు నిర్వహించిన వారిని కూడా మున్సిపాలిటీ అధికారులు తీసుకున్నా... వార్డుల్లో పని విధానం, ఇతర కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగం ఇస్తున్నారు.


సర్వే లెక్కలు, గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ గ్రామాల్లో పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. వీరందరికీ పురపాలకశాఖ నుంచే జీతాలు వచ్చేలా చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీల పరిధి పెరగటంతో.. పంచాయతీల్లో పని చేస్తున్న వారికి ఉద్యోగాలు ఇస్తుండటంతో పాటు కొత్తగా మరికొంతమందిని నియమించుకోవాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులకు విన్నపాలు వస్తున్నాయి.


మరోవైపు.. మున్సిపాలిటీల్లో విలీనమవుతున్న 51 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై కూడా మున్సిపల్‌ కమిషనర్లు ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి బెడద ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లతో సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో ఉన్న మురుగునీటి వ్యవస్థపై కూడా అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa