ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలోనే 'బీఆర్ఎస్' ఫుల్ రిచ్.. ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ దాటేసిందిగా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 23, 2024, 11:05 PM

బీఆర్ఎస్- భారత రాష్ట్ర సమితి పార్టీ ఫుల్ రిచ్. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా బీఆర్ఎస్ పార్టీనే టాప్‌లో నిలిచింది. అన్ని ప్రాంతీయ పార్టీల కంటే.. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్‌లోనే ఎక్కువ డబ్బులు ఉన్నాయంటా. ఆ పార్టీ అకౌంట్‌లో ప్రస్తుతం ఎన్ని వేల కోట్లున్నాయన్నది ఎవరో చెప్పటం కాదు.. స్వయంగా బీఆర్ఎస్ పార్టీనే వెలువరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల వివరాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ ఆడిట్‌ నివేదికను సమర్పించగా.. దాన్ని ఎలక్షన్ కమిషన్ తాజాగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఆ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఖాతాల్లో ఏకంగా.. రూ.1,449 (అక్షరాల పద్నాలుగు వందల) కోట్లు ఉండటం గమనార్హం.


రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే.. ఈ సినిమా కలెక్షన్ కేవలం రూ.1236 కోట్ల గ్రాస్ మాత్రమే. కానీ.. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్లను కూడా దాటేయటం గమనార్హం.


ఇప్పటివరకు రూ.625 కోట్లతో ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌ పార్టీ టాప్ ప్లేస్ ఉండేది. కాగా.. ఇప్పుడు ఆ పార్టీని కిందకు నెట్టేసి.. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ టాప్ ప్లేస్‌లో ఉంది. లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యే నాటికి బీఆర్ఎస్ అకౌంట్‌లో రూ.1,519 కోట్లు ఉండగా.. ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచి ముగిసేలోపు బీఆర్ఎస్ పార్టీకి రూ.47.56 కోట్ల విరాళాలు వచ్చి చేరాయి.


 అయితే.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంతో పాటు ఇతర కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా రూ.120 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు నివేదికలో వెల్లడించింది. వివిధ రకాల మాధ్యమాల్లో ప్రచారానికి రూ.10.51 కోట్లు ఖర్చుచేయగా.. ప్రచార సామాగ్రికి రూ.34.68 కోట్లు, బహిరంగసభలు, ఊరేగింపులు, ర్యాలీలకు రూ.20.37 కోట్లు, ఇతర ప్రచారానికి రూ.34.39 కోట్లు ఖర్చు చేసినట్లు ఆడిట్ నివేదికలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. అయితే.. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల అభ్యర్థులకు రూ.95 లక్షల చొప్పున మొత్తం రూ.16.15 కోట్లు నేరుగా చెక్‌, డీడీ రూపంలో ఇచ్చినట్లు ఆడిట్ నివేదికలో బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది. అభ్యర్థుల నేరచరిత్రపై ప్రకటనల కోసం రూ.73.17 లక్షలు ఖర్చు చేసినట్టు పేర్కొంది.


ఇదిలా ఉంటే.. ఇతర ప్రాంతీయ పార్టీల్లో తమిళనాడులోని డీఎంకే ఖాతాలో రూ.338 కోట్లు ఉండగా.. సమాజ్‌వాదీ పార్టీ అకౌంట్‌లో రూ.340 కోట్లు, తెలుగుదేశం పార్టీ ఖాతాలో రూ.272 కోట్లు, జేడీయూకు రూ.147 కోట్లు ఉండగా.. వైఎస్ జగన్ పార్టీ వైసీపీ ఖాతాలో మాత్రం కేవటం రూ.27 కోట్లు మాత్రమమే ఉండటం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa