ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చికాగో స్టోర్‌లో కాల్పులు.. ఖమ్మం జిల్లా యువకుడి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 10:11 PM

అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎవరు పడితే వారు విపరీతంగా తుపాకులు వినియోగిస్తున్నారు. ఈ కాల్పుల్లో చాలా మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సైతం ఈ తుపాకీ తూటాలకు బలయ్యార. తాజాగా.. అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లా కు చెందిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. చికాగోలోని షాపింగ్ మాల్‌లోకి చొరబడిన దుండగులు కాల్పులు జరపగా.. విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.


మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు సాయి తేజ(26) అమెరికాలో చదువుకుంటున్నాడు. పై చదువుల కోసం గత 4 నెలల క్రితం అమెరికాకు వెళ్లాడు. సాయి తేజ చికాగోలోని ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తూ చదవును కొనసాగిస్తున్నాడు. అయితే, శనివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) కొంతమంది దుండగులు మాల్‌లోకి దూసుకొచ్చారు. అక్కడే విధుల్లో ఉన్న సాయితేజపై కాల్పులు జరిపారు. అనంతరం దుకాణంలోని నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో సాయితేజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


దుండగులను చూసి భయపడిన సాయితేజ.. క్యాష్ కౌంటర్‌ను వారికి అప్పగించేశాడు. కౌంటర్‌లో డబ్బును దోచుకున్న దుండగులు.. బయటికి వెళ్లిపోతూ సాయితేజపై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. దీంతో సాయితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. సాయితేజ సోదరి రెండేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. సాయితేజ మరణించిన విషయం ముందుగా ఆమెకు తెలిసింది. ఆ తర్వాత ఖమ్మంలోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.


సాయితేజ మృతితో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సాయితేజ తల్లిదండ్రులను ఎమ్మెల్సీ తాతా మధు ఓదార్చారు. సాయితేజ మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఖమ్మం తీసుకురావడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని మాటిచ్చారు. కాగా, నాలుగు రోజుల క్రితం కూడా ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి కాల్పుల్లో మరణించాడు. ఓ స్టోర్‌లో దోపిడీకి ప్రయత్నించిన యువకుడు గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మైనాంక్ పటేల్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నార్త్ కరోలినాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పటేల్‌ను హాస్పిటల్స్‌కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. ఒక యువకుడు పటేల్‌పై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. స్టోర్‌లో దోపిడీ కోసమే పటేల్‌పై కాల్పులు జరిపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పటేల్‌ భార్య గర్భవతి కాగా.. వారికి ఐదేళ్ల కుమార్తె కూడా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa