ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యూచర్‌ సిటీకి భూములిచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు.. ఎకరానికి ఎన్ని గజాలంటే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 10:14 PM

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉండగా.. ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ) నిర్మాణానికి సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ దక్షిణం వైపు ఈ సిటీ నిర్మాణం కానుంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లో ఫోర్త్ సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్, ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలను ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు.


కాగా, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి రైతుల నుంచి భూసేకరణ చేపట్టారు. ఆయా రైతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి కందుకూరు, యాచారం మండలాలకు చెందిన రైతులు 13 వేల ఎకరాల భూములు ప్రభుత్వానికి అప్పగించగా... వారికి పరిహారంగా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. నిర్మాణానికి అనుకూలంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు అందజేయనుంది. ఫ్యూచర్‌ సిటీలో ఇటీవలే స్కిల్ యూనివర్సిటీ పనులు ప్రారంభం కాగా.. దానికి సమాంతరంగా ప్రస్తుతం లేఅవుట్‌ పనులు కూడా జరుగుతున్నాయి.


600 ఎకరాల్లో లే అవుట్ పనులు చేపట్టగా అందులో 8 వేల మందికి ఇండ్ల ప్లాట్లు అందించనున్నారు. ఎకరానికి 120 చదరపు గజాల చొప్పున ప్లాట్లు ఇస్తారు. అంటే ఒక రైతు ఎన్ని ఎకరాలు ఇచ్చి ఉంటే అన్ని 120 చ.గజాలు పంపిణీ చేయనున్నారు. ఒక రైతు రెండు ఎకరాలు ఇస్తే.. 240 గజాలు.., 3 ఎకరాలు ఇచ్చే ఉంటే 360 గజాలు.., 20 గుంటలు మాత్రమే ఇచ్చి ఉంటే 60 గజాలు చొప్పున ఇలా ప్లాట్లు అందించనున్నారు. లేఅవుట్‌లో ప్లాట్ల అభివృద్ధి పూర్తయిన వెంటనే రైతులు అందులో సొంతంగా ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా నిర్మించి ఇవ్వాలని కోరినా అందుకు సర్కార్ సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ఇళ్ల నిర్మాణానికయ్యే ఖర్చును ఏజెన్సీ ప్రతినిధులకు రైతులు దశలవారీగా చెల్లించాల్సి ఉంటుంది.


భూములు కోల్పోయిన వారికి మాత్రం సర్కారే ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఫోర్త్ సిటీకి భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం లేఅవుట్‌లో అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా డెవలప్ చేస్తోంది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు అన్ని మౌలిక వసతులతోపాటుగా 100 పడకల హాస్పిటల్, గురుకుల పాఠశాల, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ పనులను ప్రారంభించారు. డిసెంబరు తొలివారంలో గురుకుల స్కూల్, హాస్పిటల్ నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa