ఉమ్మడి వరంగల్ ప్రజలకు తీపి కబురు. జిల్లా ప్రజలకు పెద్ద పులులు కనువిందు చేయనున్నాయి. హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జూ పార్కుకు రెండు పులులు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవ కారక్రమాలు చేపట్టగా.. అందులో భాగంగా ఈ నెల 4న అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా జూను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కాకతీయ జూపార్కులో పులి ఎన్క్లోజర్ పనులు పూర్తికావొచ్చాయి.
హైదరాబాద్ నెహ్రూ జూ పార్కు నుంచి వీటిని తీసుకొచ్చారు. నెహ్రూ జూ పార్క్ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వై.సుభాష్ నేతృత్వంలో భద్రాద్రి సర్కిల్ ఫారెస్ట్ అధికారి భీమానాయక్, హనుమకొండ జిల్లా ఫారెస్ట్ అధికారి లావణ్య ఈ రెండు పులులను జూకు చేర్చారు. మగ పులి శంకర్ వయసు 10 ఏళ్లు కాగా.. ఆడ పులి కరీనా వయసు 15 ఏళ్లు ఉంటుందని జూ పార్కు అధికారులు వెల్లడించారు. కాకతీయ జూపార్కుకు చేరుకోగానే ఫారెస్ట్రేంజ్ అధికారి శిరీష, వెటర్నరీ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఇతర సిబ్బంది పులులను విశ్రాంతి గదుల్లో ఉంచారు. రేపు జూ పార్కు ప్రారంభం తర్వాత.. సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు.
హడలెత్తిస్తున్న పులి
ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరిపై పులి దాడి చేసింది. పులి దాడిలో ఓ యువతి చనిపోగా.. మరో రైతు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అసిఫాబాద్ జిల్లా ఇటిక్యాల్, పహాడ్, దుబ్బగూడ శివారు ప్రాంతాల్లో పులి సంచారం ఉండగా.. అటుగా వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. పెద్దపులి సంచారంతో పశువులను సయితం దొడ్లకే పరిమితం చేస్తున్నారు. ఇక పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. డ్రోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కోసం వెతుకాల ప్రారంభించారు.
అయితే ఇప్పటి వరకు పులి కెమెరాలకు చిక్కలేదు. దాని పాదముద్రలను మాత్రమే ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పులి ఫోటో చిక్కితే దాని చారలను బట్టి అది ఏ పులి.. దాని పేరేంటి అన్నది తెలుసుకునే అవకాశముందని ఫారెస్ట్ అదికారులు చెబుతున్నారు. ఇటీవల మహారాష్ట్ర నుంచి టైగర్ జానీ అనే పులి ఆడ తోడు, కొత్త ఆవాసం కోసం ఆదిలాబాద్ అడువుల వైపు వచ్చింది. ప్రస్తుతం దాడి చేస్తున్న పులి అదేనా..? లేక ఇప్పటికే అడవిలో రెండు పులులు ఉండగా.. అందులో ఒకటి దాడి చేస్తుందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. త్వరలోనే పులి జాడ కనుక్కుంటామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa