‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే థియేటర్ యాజమాన్యంతో పాటు నటుడు అల్లు అర్జున్పై పోలీసు కేసు నమోదయ్యింది. తాజాగా, పుష్ప-2పై జాతీయ మానవహక్కుల కమిషన్కు న్యాయవాది రామారావు ఇమ్మినేని ఫిర్యాదు చేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అభిమానుల రద్దీని ముందే అంచనా వేసే అవకాశం ఉన్నా పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని ఆయన ఆరోపించారు.
ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారని లాయర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీ చార్జ్ చేయడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే మహిళ మృతి చెందినట్టు పిటిషనర్ వివరించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా మానవహక్కుల కమిషన్కు లాయర్ రామారావు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ను ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించి.. త్వరలోనే దర్యాప్తు చేపట్టనుంది.
కాగా, పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి అనే మహిళ (39) మృతి చెందింది. ఈ ఘటనలో గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. 72 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. బాలుడు కూడా చనిపోయినట్టు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారాన్ని అధికారులు తోసిపుచ్చారు.
బుధవారం రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షో చూసేందుకు రేవతి, ఆమె భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్ (9), సన్వీక (7) దిల్సుఖ్నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్కు వచ్చారు. అదే సమయంలో.. హీరో అల్లు అర్జున్ అక్కడకు రావడంతో అప్పటికే పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన తర్వాత అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగి రేవతి, ఆమె కుమారుడు, మరో వ్యక్తి కిందపడి స్పృహ కోల్పోయారు. వారికి ప్రథమ చికిత్స అందించిన పోలీసులు... చికిత్స కోసం ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునేసరికే రేవతి మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు, థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa