స్పీకర్ వ్యవహారశైలిని నిరసిస్తూ... రేపు జరగనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన తరగతులను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. రేపటి ప్రజాప్రతినిధుల అవగాహన తరగతులను బహిష్కరించాలని తమ పార్టీ నిర్ణయించిందన్నారు.తమ హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. సమావేశాల తొలి రోజే తమను లోపలికి రాకుండా అరెస్ట్ చేయించారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు ఎత్తిచూపితే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తమ పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారన్నారు.గత అసెంబ్లీ సమావేశాల్లోనూ స్పీకర్ తమ గొంతు నొక్కేలా వ్యవహరించారని ఆరోపించారు. తమకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. తమ శాసనసభ్యుల్లో అతి తక్కువమంది మాత్రమే కొత్త వాళ్లు ఉన్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహారశైలికి నిరసనగా రేపటి నుంచి జరగనున్న అవగాహన తరగతులను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa