మంచువారి ఫ్యామిలీ ఫైట్ తారాస్థాయికి చేరింది. గత నాలుగు రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో చెలరేగిన గొడవలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గత రాత్రి (డిసెంబర్ 10న) జరిగిన ఘర్షణ, మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేసిన దాడితో.. ఈ వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. దీంతో.. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్కు సైబరాబాద్ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 10.30 గంటలకు సీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే.. తనకు నోటీసులు జారీ చేయటాన్ని సవాలు చేస్తూ మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.
తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా.. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. గొడవల నేపథ్యంలో పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలని కోరినా.. కనీస భద్రత కల్పించలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే తన ఇంటి వద్ద భద్రత కల్పించాలని పిటిషన్లో మోహన్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం.. అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ బాబు తరఫున.. సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళి మనోహర్ ఈ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. మనోజ్కు మోహన్ బాబుకు మధ్య జరుగుతున్న గొడవ ఫ్యామిలీ విషయమని అభిప్రాయపడింది. ఈనెల 24వరకు విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని మోహన్ బాబుకు భారీ ఉపశమనం కలిగించింది. మరోవైపు.. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మోహన్ బాబు ఇంటి వద్ద నిఘా పెట్టాలని.. ప్రతి రెండు గంటలకోసారి అక్కడి పరిస్థితి పరిశీలించాలని.. సీసీ కెమెరాలతో పర్యవేక్షించాలని ఆదేశించింది. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది.
నోటీసులపై మంచు విష్ణు స్పందన
అంతకు ముందు.. నోటీసులపై స్పందించిన మంచు విష్ణు.. తమకు ఈరోజు(డిసెంబర్ 11న) ఉదయం 9 గంటల తర్వాత పోలీసుల నోటీసులు అందాయని తెలిపారు. మీడియాలో చూసిన తర్వాతే తనకు నోటీసులు అందాయని తెలిసిందని.. మొదట మీడియాకే తెలిసిందని.. ఆ తర్వాతే తనకు వచ్చాయని చెప్పుకొచ్చారు. సీపీకి గౌరవమిస్తూ.. విచారణకు హాజరవుతానని విష్ణులు తెలిపారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో మోహన్ బాబు విచారణకు హాజరు కాలేదు. విష్ణు కూడా విచారణకు హాజరుకాకపోవటం గమనార్హం.
మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు
మరోవైపు.. మంచు మనోజ్ మాత్రం సీపీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గొడవ, దాడులకు సంబంధించిన అన్ని విషయాలపై గంటన్నర పాటు మనోజ్ను ప్రశ్నించి సీపీ సుధీర్ బాబు వివరణ తీసుకున్నారు. తనకు న్యాయం జరుగుతుందని.. పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందని మనోజ్ తెలిపారు. తామంతా సామరస్యంగా సమస్య పరిష్కరించుకుంటామని.. తన అన్న విష్ణు ప్రోద్బలంతో ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చారు. తమ అమ్మ ఆస్పత్రిలో అడ్మిట్ అయిందన్నది అవాస్తవమని మనోజ్ చెప్పుకొచ్చారు.
"వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన్ సంస్థల్లో అక్రమాలు చేస్తున్నాడు.. ఈ విషయాలేవి మా నాన్నకు తెలియవు.. వినయ్ మా ఇంట్లో చిచ్చురేపాడు.. మా ఇంట్లో గొడవకు కారణం నాకు తెలియదు.. తెలిసినా చెప్పను." అంటూ మనోజ్ చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa