ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండగల్ రోడ్లకు కొత్త రూపు.. సీఎం సొంత నియోజకవర్గంలో వేగం పనులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 07:39 PM

కొండగల్ రోడ్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్, ఆర్‌ అండ్‌ బీ రోడ్లకు మంచి రోజులు వచ్చాయి. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. రోడ్ల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో వేగంగా పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని కొడంగల్, దుద్యాల, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల పరిధిలో గతంలో ఉన్న మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చుతున్నారు. గతంలో సింగిల్‌ రోడ్లుగా ఉన్న వాటిని ఇప్పుడు డబుల్ రోడ్లుగా తీర్చిదిద్దుతున్నారు. అందుకు రూ.380.52 కోట్ల నిధులు మంజూరు చేశారు.


ఈ రహదారుల అభివృద్ధికి గాను... కొన్నింటికి టెండర్లు ఖరారు పూర్తయింది. దీంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. చాలా ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని రహదారులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో తమ ప్రయాణ కష్టాలు తీరతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు మండలాల పరిధిలో మెుత్తంగా 70.32 కిలో మీటర్ల మట్టి రోడ్లను బీటీగా మారుస్తున్నారు. అందుకు రూ.130.52 కోట్లు మంజూరు చేశారు. కొడంగల్‌ మండల పరిధిలోని ఆరు రోడ్లకు రూ.45.29 కోట్లు, బొంరాస్‌పేట మండలంలోని 8 రోడ్లకు రూ.52 కోట్లు, దౌల్తాబాద్‌ మండలంలోని నాలుగింటికి రూ.32 కోట్లు మంజూరు చేశారు.


ఆర్‌ అండ్‌ బీ పరిధిలోని 11 రోడ్లను రెండు వరుసలుగా మారుస్తున్నారు. రహదారులపై రెండు వంతెనల నిర్మాణానికి మెుత్తంగా రూ.250 కోట్లు కేటాయించారు. బొంరాస్‌పేట మండలం మహంతీపూర్‌ గ్రామానికి నాలుగు దశాబ్దాలుగా పక్కా రోడ్డు లేదు. అలాంటి గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం కోసం రూ.23 కోట్లు మంజూరు చేశారు. కాకరవాణి వాగుపై వంతెన నిర్మించి ఈ రోడ్డు నిర్మాణం పూర్తిచేయనున్నారు. ప్రస్తుతం ఈ రహదారుల పనులు కొనసాగుతున్నాయి.


ఇదే మండలం కొత్తూరు నుంచి దేవనూరు శివారు వరకు మట్టి రోడ్డును బీటీతో రెండు వరుసలుగా మారుస్తున్నారు. అందుకరు రూ.11 కోట్లు మంజూరు చేశారు. ఈ రహదారి పూర్తయితే తాండూరుకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. దౌల్తాబాద్‌ మండలం తిమ్మారెడ్డిపల్లి నుంచి నాగసార్‌ మీదుగా తండాకు వంతెన నిర్మిస్తన్నారు. దాంతో పాటుగా నిర్మించే బీటీ రోడ్డుకు నిధులు మంజూరు చేయగా.. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. తమ తమ గ్రామాలకు కొత్త రోడ్లు రావటం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa