ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 07:45 PM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పదేళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. అధికారంలోకి రాగానే.. తమదైన మార్క్‌తో సీఎం రేవంత్ పాలన సాగిస్తున్నారు. పాలనతో పాటుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సైతం మార్చింది. రాష్ట్ర గీతమైన జయజయహే తెలంగాణను ప్రత్యేకంగా స్వరపరిచారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. గతంలో ఉన్న విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం కాదని చెబుతూ.. ఈనెల 9న సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు.


తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగామ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’, తెలంగాణ తల్లి ఫొటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి పదో తరగతి టెక్ట్స్ బుక్స్‌లో వీటిని ముద్రించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో ఉన్న ప్రతిజ్ఙతో పాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉండగా.. వాటితో పాటు తెలంగాణ రాష్ట్ర గీతం అందుబాటులోకి రానుంది. అలాగే తెలంగాణ తల్లి ఫోటోను కూడా ముద్రించనున్నారు. ఇక 2026-27 విద్యా సంవత్సరం కొత్త సిలబస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి కీలక ప్రకటన చేశారు.


ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి తెలుగులో ఉత్తర్వులు జారీ చేశారు. 'బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరను ధరించి, ప్రశాంతమైన నడవడికతో సంప్రదాయ మహిళా మూర్తిగా ఉన్న ఈ విగ్రహం నేడు తెలంగాణ తల్లి విగ్రహంగా ఆమోదం పొందింది. ఇక నుంచి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రం, జిల్లా, మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలి' అని జీవోలో పేర్కొంది. తెలంగాణ తల్లి బొమ్మను, రూపురేఖలను వక్రీకరించడం, మరో విధంగా చూపించడం నిషేధమని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి చిత్రాన్ని బహిరంగంగా లేదా సోషల్ మీడియాలో మాటలతో లేదా చర్యల ద్వారా అగౌరవపరచడం, కాల్చడం, అవహేళన చేయడం, నాశనం చేయడం, అవమానించడం, కించపరచడం నేరమని జీవోలో వెల్లడించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa