బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్.. మీడియాతో చిట్ చాట్లో సంచలన విషయాలు మాట్లాడారు. తెలంగాణ నుంచి టాలీవుడ్ ఆంధ్రాకు తరలిపోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కు వెళ్లిపోతే తెలంగాణకే నష్టమని అన్నారు. తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న బండి సంజయ్.. వారిని ఆ పార్టీ హైకమాండ్ కంట్రోల్లో ఉంచాలని బండి సంజయ్ సూచించారు.
ఇక అంబేద్కర్ గురించి కాంగ్రెస్ పార్టీ నేతలకు మాట్లాడే అర్హత కూడా లేదని బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాళాలు వేశారని.. అంబేద్కర్ చరిత్ర తెలిపేలా ఉన్న గదుల్లోకి ఎవరినీ వెళ్లనీయడం లేదని విమర్శించారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లలేదని విమర్శించారు. ఇక అబద్దాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అబద్దాలతో ముందుకు వెళ్తున్న పార్టీ.. కాంగ్రెస్ పార్టీ అని తీవ్ర ఆరోపణలు చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ శత జయంతి కార్యక్రమంలో భాగంగా.. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఆ పార్టీ నేతలు నివాళులు అర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత బీజేపీ కార్యాలయంలో బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. వాజ్పేయ్ భారతదేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటారని బండి సంజయ్ గుర్తు చేశారు. పదవుల కోసం ఆశపడకుండా నిస్వార్థంగా పని చేశారని కొనియాడారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా.. ప్రజాతీర్పుతో మళ్లీ అధికారంలోకి వచ్చారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa