ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు.. నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో.. పోలవరం ప్రాజెక్టుపై సమగ్రంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో.. తెలంగాణ మీద పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ బృందంతో నివేదిక తయారు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
2022లో భారీ వర్షాల సమయంలో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ మీద ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని రేవంత్ రెడ్డికి అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో.. తమ అభ్యంతరాలను ఏపీ సీఎస్కు తెలియజేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జల్శక్తి శాఖకు లేఖలు రాయాలంటూ రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు స్వభావానికి వివరించారు. గోదావరి నుంచి ప్రతి సంవత్సరం 2 వేల నుంచి 4 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని.. ఆ నీటిని సమర్థవంతంగా వాడుకుంటే ఏపీ రూపురేఖలే మారిపోతాయని చెప్పుకొచ్చారు. 194 టీఎంసీల నీటి సామర్థ్యంతో పోలవరం నిర్మాణం మొదలెట్టినట్టు గుర్తు చేసిన చంద్రబాబు.. మరో 200 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశముందని చెప్పారు.
7.2 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందుతుందని.. 28.50 లక్షల మంది జనాభాకు తాగునీరు అందుతుందని చంద్రబాబు వివరించారు. 23.50 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చన్నారు. 960 మెగావాట్ల జలవిద్యుత్ కూడా ఉత్పత్తి చేసే వీలుందని బాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు పోలవరం లైఫ్ లైన్ అని చంద్రబాబు అభివర్ణించారు. 5 కోట్ల ప్రజల కల అని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa