రైతు భరోసా పథకంపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జనవరి 26 నుంచి పథకం అమలు చేస్తామని శనివారం నాటి కేబినేటి అనంతరం వెల్లడించారు. అయితే ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని రేవంత్ ప్రకటించారు. ఎన్నికల హామీలో చెప్పిన దానికి భిన్నంగా రైతు భరోసా డబ్బులు తగ్గించి ఇస్తామని రేవంత్ వెల్లడించటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.
ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందంటూ ఎక్స్ వేదికగా ఫైరయ్యారు. మోసానికి మారు పేరుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్ అని మండిపడ్డారు. రైతుద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వమని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 'అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా నెక్కినఁ బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ! అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్.. మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం.. మోసానికి మారు పేరు కాంగ్రెస్.. ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్.
రైతుద్రోహి ముఖ్యమంత్రి రేవంత్.. రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒడ్డెక్కి తెడ్డుచూపిన ఇందిరమ్మ రాజ్యం. అన్నింటా మోసం .. వరంగల్ డిక్లరేషన్ అబద్దం. రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకం. ప్రచారం రూ.15 వేలు- అమలు చేస్తామంటున్నది రూ.12 వేలు. సిగ్గు సిగ్గు.. ఇది సర్కారు కాదు. మోసగాళ్ల బెదిరింపుల మేళా. అబద్దానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్. మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్!' అని ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు.
ఇక రేవంత్ ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీ పోస్టర్ అటాక్ మొదలు పెట్టింది. 'ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తావ్ రేవంత్.. మీరు 2023 యాసంగి ఎకరానికి రూ.2,500లు, 2024 వానకాలం ఎకరానికి 7,500లు, యాసంగి ఎకరానికి రూ.7,500 మొత్తం రూ.17,500 కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఎకరానికి బాకీ పడ్డారు.' అంటూ పోస్టర్లు అంటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa