ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 06, 2025, 07:35 PM

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నోటీసులు, కేసులు, విచారణలతో రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్‌‌గా నడుస్తుండగా.. ప్రస్తుతం మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ రేసు కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా పేర్కొనగా.. ఏసీబీ, ఈడీ వరుసగా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈరోజు ఏసీబీ విచారణకు హజరయ్యేందుకు వెళ్లిన కేటీఆర్.. తన లాయర్‌ను అనుమతించలేదన్న కారణంతో తిరిగి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. కేటీఆర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలకు ఉపక్రమించారు. గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాస్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఏసీబీ సోదాలు ప్రస్తుతం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారాయి. తర్వాత ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.


అయితే.. తన ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతాయని ఈరోజు (జనవరి 06న) ఉదయమే కేటీఆర్ మీడియాతో చెప్పటం గమనార్హం. ఆయన చెప్పినట్టుగానే ఏసీబీ అధికారులు సాయంత్రానికి ఆయన నివాసంలో సోదాలకు ఉపక్రమించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేబినెట్ ఆమోదం లేకుండానే డబ్బులు ముట్టజెప్పారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆ సమయంలో మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ఏ1గా ఏసీబీ చేర్చింది. ఈ క్రమంలోనే.. జనవరి 02న నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం.. ఈరోజు (జనవరి 06న) ఉదయమే కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అయితే.. విచారణకు తనతో పాటు తన లాయర్‌ను అనుమతించకపోవటంతో.. తాను అధికారులకు చెప్పాలనుకున్నదాన్ని రాతపూర్వకంగా పోలీసులకు సమర్పించి.. కేటీఆర్ వెనుదిరిగారు.


తిరిగి వెళ్తున్న సమయంలో.. మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌.. తాను లేనప్పుడు తన ఇంట్లో ఏసీబీ సోదాలు చేయాలని చూస్తోందని... సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో కావాలని ఏదైనా పెట్టి తన ఇంట్లో దొరికినట్లు చూపించాలని కుట్ర పన్నుతున్నారంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ఆయన చెప్పినట్టుగానే సాయంత్రానికి ఏసీబీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. అయితే.. కేటీఆర్ ఇంట్లో ఏమైనా దొరుకుతాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే.


ఇదిలా ఉంటే.. ఈ కేసులో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా.. కాస్త ఊరట లభించిన విషయం తెలిసిందే. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. అయితే.. క్వాష్‌ పిటిషన్‌పై కోర్టు తీర్పు రిజర్వ్‌ అయిందని అయినా ఏసీబీ కావాలని తనను విచారణకు పిలుస్తోందంటూ కేటీఆర్ మండిపడ్డారు. కాగా.. ఈరోజు విచారణ జరగకపోవటంతో.. కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులిచ్చి విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa