ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంట వేసినా వేయకున్నా, ఆ భూములకు కూడా రైతు భరోసా.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం.

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 08:25 PM

తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రైతు భరోసా పథకం అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. జనవరి 26వ తేదీన రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ హామీలను కూడా అమలు చేయేనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. కాగా.. ఈరోజు (జనవరి 10న) సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.


ఈ క్రమంలోనే రైతు భరోసా అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు పంట వేసినా.. వేయకున్నా.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి మండలంలోని ఎమ్మార్వో, ఏఈవో.. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో భాగస్వాములుగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలని తెలిపిన సీఎం రేవంత్.. సాగు అక్కరకు రాని భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వకూడదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. అలాంటి సాగు యోగ్యంకాని భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు.


రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన భూములు, లే అవుట్ స్థలాలు, నాలా కన్వర్ట్ అయిన భూములు, మైనింగ్ స్థలాలు, గోదాములు నిర్మించిన స్థలాలు, వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన భూముల వివరాలను ముందుగానే సేకరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవాలన్నారు. వీటితోపాటు విలేజ్ మ్యాప్‌లను పరిశీలించి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి.. ధ్రువీకరించుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.


వ్యవసాయ యోగ్యంకాని భూముల జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆ భూముల గురించి గ్రామ సభల్లో చర్చించి రైతులకు వెల్లడించాలన్నారు. ఎలాంటి అనుమానాలు అపోహలకు తావు లేకుండా రైతు భరోసాను అమలు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


ఇదిలా ఉంటే.. సమావేశంలో కలెక్టర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవటంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచినా ఇలాంటి ఘటనలు జరగటం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్లు పర్యవేక్షణ చేయకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణం అవుతున్నాయన్నారు. ఇక నుంచి వారం వారం ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లను కలెక్టర్లు సందర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa