ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలాలో పసికందు డెడ్ బాడీ...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 12:58 PM

నగరంలో దారుణం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పసికందు డెడ్‌ బాడీని స్థానికులు గుర్తించారు. గంపల బస్తీలోని నాలాలో పసికందు డెడ్ బాడీ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనాస్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. నాలాలోకి ఈ డెడ్ బాడీ ఎలా వచ్చిందనే కోణంలో విచారణ చేపట్టారు. ఎక్కడినుంచైనా ఈ పసికందు డెడ్ బాడీ కొట్టుకువచ్చిందా, లేదంటే గంపల బస్తీలో ఉంటున్నవారు ఎవరైనా పడేశారా అనేది తెలియాల్సిఉంది. పాప కావడంతో పుట్టినతర్వాత ఉద్దేశపూర్వకంగా నాలాలో పడేసిఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పుట్టిన తర్వాత పిల్లలను వదిలించుకునే ఉద్దేశంతో తుప్పల్లో లేదా నాలాల్లో పడేస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అమ్మాయిల విషయంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పుట్టిన బిడ్డలను ఇలా చేయడం నేరమని తెలిసినప్పటికీ కొంతమందిలో ఇంకా చైతన్యం రాకపోవడంతో సొంత బిడ్డలను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


గతంలో లింగనిర్థారణ పరీక్షలు నిర్వహించి అమ్మాయి అని తెలియగానే గర్భంలో ఉండగానే బిడ్డను చంపేటువంటి ఘటనలు ఎక్కువ జరుగుతుండేవి. గర్భం దాల్చడానికి ముందు లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించడం నేరమని తెలిసినప్పటికీ కొన్ని ఆసుపత్రుల్లో అనధికారికంగా ఈ పరీక్షలు నిర్వహించేవారు. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించకుండా కఠినమైన చర్యలు చేపట్టింది. ఏదైనా ఆసుపత్రుల్లో లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిస్తే ఆసుపత్రి అనుమతులు రద్దు చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేయడం, తల్లిదండ్రులపై కేసులు పెట్టడం వంటి చర్యలతో లింగ నిర్థారణ పరీక్షలు జరగకుండా అడ్డుకట్టవేయగలిగారు. ఇప్పటికీ అక్కడక్కడ లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టినట్లు చెప్పుకోవచ్చు.


లింగ నిర్థారణ పరీక్షలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో ప్రస్తుతం పుట్టిన తర్వాత బిడ్డలను వదిలించుకునేందుకు కొంతమంది తమ పిల్లలను వారి చేతులతోనే చంపేస్తున్నారు. ప్రభుత్వం ఇటువంటి ఘటనపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతోనే ఇలాంటి దురాగతాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa