ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. చివర్లో ఎయిర్ పోర్టు అధికారులు, సిబ్బందికి మతి పోయింది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 07:31 PM

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సైబరాబాద్ కంట్రోల్ రూమ్‌కు ఓ అగంతకుడు ఫోన్ చేసి బాంబు ఉందంటూ సమాచారం ఇచ్చారు. దీంతో.. అప్రమత్తమైన ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అడుగడుగునా చెక్ చేసిన తర్వాత.. బాంబు లేదని నిర్ధారించుకున్న భద్రతా సిబ్బంది.. అసలు ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందని తెలుసుకున్నారు. ఈ క్రమంలో... ఆ కాల్ ఫేక్ అని తేల్చారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి గురించి తెలిసి.. ఎయి‌ర్‌పోర్ట్ సిబ్బందికి దిమ్మతిరిగిపోయింది. కాల్ చేసిన వ్యక్తి.. తెలంగాణలోని కామారెడ్డి వాసిగా గుర్తించగా.. సదరు వ్యక్తికి మతిస్థిమితం లేదని గుర్తించారు. మొత్తానికి బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేలడంతో ఎయిర్పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


ఇదిలా ఉంటే.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఈరోజు (జనవరి 30) వరకు భద్రతా బలగాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. జనవరి 26వ తేదీన జరిగిన గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే.. శంషాబాద్ ఎయిర్ పోర్టు నిఘా విభాగం అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జనవరి 30 వరకు ఎయిర్ పోర్టుకు సందర్శకులెవ్వరూ రావొద్దని కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు.


ఈ నేపథ్యంలో.. ఎయిర్ పోర్టులోని ప్రధాన రహదారిలో ఎక్కడికక్కడ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో ముమ్మల తనిఖీలు చేపట్టారు. ఎయిర్ పోర్టుకు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ప్రయాణికులు కాకుండా ఎయిర్ పోర్టుకు వచ్చే సందర్శకులకు అనుమతి నిరాకరిస్తూ అధికారులు ప్రకటన కూడా జారీ చేశారు. ఇలాంటి సందర్భంలోనే.. ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావటంతో.. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. రెడ్ అలర్ట్ ప్రకటించి ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు నిర్వహించినా.. ఎయిర్ పోర్టులోకి బాంబు ఎలా వచ్చిందన్న కోణంలో ముమ్మరంగా తనిఖీలు చేశారు. అయితే.. ఆ కాల్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీయగా.. అతనికి మతిస్థిమితం లేదని తెలియటంతో.. దిమ్మతిరిగిపోయింది.


అయితే.. గతంలో కూడా ఎయిర్ పోర్టుకు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ చాలానే వచ్చాయి. ఇలాంటి ఫేక్ కాల్స్ చేసే వారిపై పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఆకతాయిలు మాత్రం ఫేక్ కాల్స్ చేయటం మానట్లేదు. వాళ్లు చేసేది ఒక ఫోన్ కాలే కదా అనుకుంటున్నారు కానీ.. కొన్ని వేల మంది టెన్షన్ పడతారని, ఎంతో విలువైన సమయం వృథా అవుతుందని.. ఎయిర్ పోర్టుకు ఎంతో నష్టం కలుగుతుందని.. గ్రహించలేకపోతుండటం శోచనీయం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa