తెలంగాణలో త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న వేళ.. కమలం పార్టీ కీలక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఇప్పటికే వార్డు, గ్రామ, మండల, డివిజన్ అధ్యక్షుల నియమాకాన్ని పూర్తి చేసింది. అనంతరం జిల్లా అధ్యక్షుల నియామకంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే సోమవారం కొత్త జిల్లా అధ్యక్షులను కమలం పార్టీ హైకమాండ్ ప్రకటించనుంది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ సునీల్ బన్సల్, ఎన్నికల పరిశీలకులు అరవింద మీనన్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిలు కేంద్ర నాయకత్వంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు బీజేపీ హైకమాండ్ ఓకే చెప్పడంతో జిల్లా అధ్యక్షుల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షులుగా పోటీ పడేవారు.. శనివారం నుంచి నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 11 జిల్లాల అధ్యక్షుల ప్రకటనను హైకమాండ్ పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తుంది. మిగిలిన 22 జిల్లాలకు ఆశావాహుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆ తర్వాత నామినేషన్లను పరిశీలించి.. కొత్త జిల్లా అధ్యక్షులను సోమవారం బీజేపీ హై కమాండ్ ప్రకటించనుంది.
మరోవైపు.. 2 నెలల క్రితం నుంచే రాష్ట్రంలో పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ జోరుగా నిర్వహించింది. ఆ తర్వాత కొన్నిరోజులకు బీజేపీ యాక్టివ్ మెంబర్ షిప్ డ్రైవ్ను కూడా చేపట్టింది. ఆ తర్వాత సంక్రాంతి పండగ వరకు గ్రామంలో వార్డు స్థాయి నుంచి మొదలుకొని దేశంలోనే జాతీయ అధ్యక్షుడి వరకు అన్ని ఎన్నికలు పూర్తి చేయాలని కమలం పార్టీ భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే.. ఒక్కో రాష్ట్రంలో స్థానిక పరిస్థితులకు తగ్గట్టు.. యువత, మహిళలకు పెద్దపీట వేస్తున్న కమలం పార్టీ.. యాక్టివ్గా ఉన్న కార్యకర్తలను వార్డు స్థాయి నుంచి మొదలుకుని.. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
మరోవైపు.. బీజేపీలో మొదటి నుంచి అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఈ క్రమంలోనే మొదట బూత్ అధ్యక్షుడి నుంచి మొదలుకొని వార్డు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అధ్యక్షుల నియామకం ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ రాష్ట్ర స్థాయి ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇక త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కూడా ఉంటుందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. కిషన్ రెడ్డి తర్వాత రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఎవరికి అప్పగించాలి అనేది హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది. మరోవైపు.. ప్రస్తుతం అధ్యక్ష రేసులో కీలక నేతలు ఆశతో ఉన్నారు.
అయితే బీజేపీ హైకమాండ్.. బీసీ నేతలకు అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మరోసారి బండి సంజయ్కే పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ కార్యకర్తలు, నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారో.. దాని ప్రభావం రాష్ట్రంలో పార్టీపై పడనున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అయితే అన్ని రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక పూర్తి అయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడి నియామకం జరగనుంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా.. ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ఇప్పటికే ఎప్పుడో పూర్తి అయినా.. పలు కారణాల వల్ల పొడిగిస్తూ వస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa