ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్‌ గాంధీతో గ్యాప్,.. సీఎం రేవంత్‌ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 07:01 PM

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న ఆసక్తికర పరిస్థితుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తున్న వేళ.. ఇప్పుడైనా కేబినెట్ విస్తరణ జరుగుతుందని అంతా భావిస్తుండగా.. మరోసారి హస్తం శ్రేణుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఈసారి కూడా కేబినెట్ విస్తరణ లేనట్టే. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తెలిపారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. తనకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి వివరించారు.


మరోవైపు.. కులగణన సర్వే అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కులగణన ఆశామాషీగా చేసింది కాదని.. ఎంతో పకడ్బందీగా చేశామని తెలిపారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని.. ఈ విషయంలో ఈరోజు లేదా రేపు ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చారు.


ఇక.. కాంగ్రెస్ అగ్రనేతల రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందని కొంతకాలంగా మీడియాలో వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. తనకు రాహుల్‌ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని.. తమ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందని స్పష్టం చేశారు. అయితే.. ఈసారి రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ తాను కోరలేదని చెప్పుకొచ్చారు.


మీడియాతో చిట్ చాట్ కంటే ముందు పార్లమెంట్‌లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ పని తీరు గురించి ఖర్గేకు రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్ ఉన్నారు.


మరోవైపు.. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణ ముఖ్యనేతలతో విడివిడిగా చర్చలు జరిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్‌ మున్షీతో చర్చించారు. పీసీసీ కార్యవర్గ కూర్పు, కేబినెట్ విస్తరణపై నేతల అభిప్రాయాలను వేణుగోపాల్ సేకరించారు.


పీసీసీ కార్యవర్గం ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించనుండగా.. అందులో సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని ఒక మాదిగ, ఒక ముస్లిం, ఒక లంబాడా, ఒక రెడ్డి వర్గాలతో నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు ఉండనున్నట్లు సమాచారం. 15 నుంచి 20 మంది వరకు ఉపాధ్యక్షులు ఉండే ఛాన్స్ ఉంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa