ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని, వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంను, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? వారికి ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు? అన్ని మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఉంటే తెలపాలని కోరారు. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. వసతి గృహంలోని స్టోర్ రూమ్, వంటగది, డార్మెట్రీలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు ఆడుకోవడానికి క్రికెట్ కిట్ సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. తదనంతరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదాంను తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న ఎరువుల గురించి ఆరా తీశారు. ఇప్పటివరకు ఎంత మంది రైతులకు ఎంత ఎరువులు విక్రయించారు.
వాటి ధరలు ఎంత అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ లను పరిశీలించారు. ఎరువుల లభ్యత గురించి రైతులు ఆందోళన చెందవద్దని, అందుబాటులో ఎరువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల లభ్యత, ధరలకు సంబంధించిన పట్టికను గోదాం బయట ఏర్పాటు చేయాలని ప్యాక్స్ కార్యదర్శిని ఆదేశించారు. చివరగా గ్రామంలోని అంబేద్కర్ నగర్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న తరగతి గదులు పూర్తి చేయడంలేదనే విషయాన్ని తోట ధర్మేందర్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, నిర్మాణం పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని తహశీల్దార్, ఎంపీడీఓ లను కలెక్టర్ ఆదేశించారు. సందర్శనలో జిల్లా వైద్యాధికారి డా.రజిత, పిఆర్ ఈఈ సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, వార్డెన్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa