ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ ట్యాపింగ్ కేసు.. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుకు బెయిల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 07:44 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుకు కోర్టులో ఊరట దక్కింది. నాంపల్లి కోర్టు ఆయనకు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. ప్రణీత్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై పలు దఫాలుగా విచారణ చేపట్టిన నాంపల్లి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి.. ఎట్టకేలకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించారు. కాగా, సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఏ2గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీగా చంచల్‌గూడ జైలులో ఉన్నారు.


రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ఫిబ్రవరి 11న ఆయన తరఫున లాయర్ ఉమామహేశ్వరరావు 1వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు పూర్తి చేశారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాంబశివారెడ్డి విచారణకు హాజరుకాకపోవడంతో పీపీ వాదనల కోసం జడ్జి రమాకాంత్ విచారణను గురువారానికి వాయిదా వేశారు. గురువారం పీపీ వాదనలు అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.. శుక్రవారం ఉదయం నిర్ణయం వెలువరించారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ తిరుపతన్న, ప్రభాకర రావు, భుజంగరావుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ మంజూరైంది.


ప్రణీత్‌రావు తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ.. భుజంగరావుకు బెయిల్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మధ్యంతర బెయిల్‌ గడువును హైకోర్టు సైతం పొడిగించదని, అనంతరం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిందని వివరించారు. విచారణ పూర్తి కాలేదని పోలీస్ అధికారులు కౌంటర్ అఫిడివిట్‌లో పేర్కొన్నప్పటికీ పీపీ వాదనల్ని హైకోర్టు తిరస్కరించిందని వివరించారు. 90 రోజులు రిమాండ్‌ ఖైదీగా పూర్తిచేసుకున్న తర్వాత 167 సీర్పీసీ కింద ప్రణీత్‌రావు దాఖలు చేసిన మ్యాండేటరీ (తప్పనిసరిగా) బెయిల్‌ను 14వ అడిషినల్ చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్టేట్‌ కోర్టు కొట్టివేసిందని తెలిపారు..


అలాగే, తిరుపతన్నకు సుప్రీంకోర్టు, రాధాకిషన్‌రావుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిందని, దాదాపు ఏడాదిగా చంచల్‌గూడా జైలులో రిమాండ్‌ఖైదీగా ఉన్న ప్రణీత్‌రావుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయాలని కోరడంతో వాదనలను పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa