శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ప్రమాదం విషాదాంతమే అయ్యింది. ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 8:30 గంటల సమయంలో పైకప్పు కూలిన ఘటనలో 8 మంది లోపలే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆ 8 మందిని ఎలాగైనా ప్రాణాలతో బయటికి తీసుకురావాలని ప్రతి ఒక్కరు శాయాశక్తులా ప్రయత్నించిన ప్రయత్నాలన్ని విఫలమే అయ్యాయి. వారం రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో భాగంగా.. ఈరోజు (ఫిబ్రవరి 28న) టీబీఎం మిషన్ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్తో కట్ చేశారు. దీంతో.. టన్నెల్లోని బురద, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా.. గ్రౌండ్ పెనిట్రెటింగ్ రాడర్ టెక్నాలజీతో కార్మికుల జాడ కోసం టన్నెల్లో స్కానింగ్ నిర్వహించారు.
ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని సొరంగం లోపలికి పంపించగా.. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి దిబ్బల కింద పరిశీలించగా.. ఐదు ప్రాంతాల్లో మెత్తటి భాగాలు గుర్తించినట్టు తెలుస్తోంది. సుమారు మూడు మీటర్ల లోతు మట్టిలో ఈ మెత్తని భాగాలు కనిపించినట్టు తెలుస్తోంది. అయితే.. ఆ మొత్తని భాగాలు మృతదేహాలేనని అధికారులు భావిస్తున్నారు. మొత్తని భాగాలు గుర్తించిన చోట.. తవ్వకాలు జరిపి మృతదేహాలను బయటికి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
టన్నెల్ ప్రమాద స్థలంలో రక్షణ చర్యలను వేగవంతం చేసిన ప్రక్రియలో భాగంగా.. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) ఆపరేషన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా మట్టి దిబ్బల కింద 8 మంది కూరుకుపోయి ఉంటే వారి పరిస్థితిని తెలుసుకునేందుకు ఆధునాతన టెక్నాలజీ జీరో గ్రావిటీ పెనట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ మిషన్ ఆధారంగా ఎన్జీఆర్ఐ బృందం టన్నెల్ను పూర్తిగా స్కాన్ చేసి మృతదేహాలను గుర్తించింది.
ఇందులో ఐదు అనుమానాస్పద ప్రదేశాలను గుర్తించడంతో పాటు శరీర నిఘా కోసం మార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఐదు మృతదేహాలు మాత్రం మూడు మీటర్ల లోతులో కూరుకుపోయినట్లు తెలిసింది. మిగతా మూడు మృతదేహాలు ఎంత లోతులో ఉన్నది కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే.. ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో పైకప్పు కూలిన సమయంలో మట్టి దిబ్బలు వారిపైనే పడి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో.. 8 మందిలో ఏ ఒక్కరూ మిగలకుండా ప్రాణాలు వదిలి ఉంటారని భావిస్తున్నారు. 8 మందిలో.. ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa