ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెట్లు నరకడం వెంటనే ఆపండి.. కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 02, 2025, 08:01 PM

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనున్న 400 ఎకరాల భూమి విషయంలో తలెత్తిన వివాదం అగ్గి రాజేస్తోంది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల స్థలం ప్రభుత్వానిదేనని ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఆ స్థలాన్ని చదును చేసి అభివృద్ధి చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ క్రమంలో.. పదుల సంఖ్యలో జేసీబీలు.. ఆ స్థలంలోని చెట్లు తొలగిస్తూ చదును చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టటంతో.. అటు హెచ్సీయూ విద్యార్థులు, పర్యావరణ వేత్తలు, విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసింది. ఇదే క్రమంలో.. "వటా ఫౌండేషన్" అనే సంస్థ, హెచ్‌సీయూ విద్యార్థులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఈ భూమిని పరిశ్రమల కోసం ఉపయోగించాలనుకుంటోందని.. కానీ ఈ స్థలాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరారు.


ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు (ఏప్రిల్ 02న) మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. రేవంత్ రెడ్డి సర్కారుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ స్థలంలో చెట్లు నరకడాన్ని వెంటనే ఆపాలని కోర్టు ఆదేశించింది. రేపటి వరకు ఎలాంటి చెట్లు నరకడం కానీ, ఎలాంటి పనులు గానీ అక్కడ చేయొద్దంటూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రేపు (ఏప్రిల్ 03) మధ్యాహ్నానికి వాయిదా వేసింది.


హైకోర్టులో వాదనల సమయంలో హెచ్‌సీయూ తరపున ఎల్‌. రవిశంకర్‌ వాదనలు వినిపించారు. గతేడాది జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 54 తీసుకొచ్చిందని.. ఈ జీవో ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీకి ఇస్తున్నట్టు పేర్కొన్నారని తెలిపారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పని చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల వద్ద పెద్ద పెద్ద జేసీబీలను ఉపయోగించి చెట్లు కొట్టేసి.. భూమిని చదును చేస్తున్నారని ధర్మాసనానికి వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలని పేర్కొన్నారు.


వన్య ప్రాణులు ఉన్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించాలని.. నెల రోజుల పాటు అధ్యయనం చేయాల్సి ఉంటుందని ధర్మాసనానికి తెలిపారు. 400 ఎకరాల భూముల్లో 3 లేక్‌లు ఉన్నాయని.. రాక్స్ ఉన్నాయని.. ఎన్నో రకాల అరుదైన జంతువులున్నాయని తెలిపారు. వాటన్నింటినీ పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఇక్కడ సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. కొన్ని రోజులుగా ఈ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని ధర్మానసనానికి విన్నవించారు.


ప్రభుత్వ తరపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. గూగుల్ ఫోటోలు చూపించి అక్కడ ఫారెస్ట్ ఉంది అంటున్నారని.. కానీ అక్కడ ఫారెస్ట్ లేదని తెలిపారు. తన స్నేహితుడు మెంబర్‌గా ఉన్న ఒక గోల్ఫ్ క్లబ్‌లో కూడా నెమళ్లు, జింకలు, పాములు ఉన్నాయని.. అలా అని దానిని ఫారెస్ట్‌గా డిక్లేర్ చేస్తారా..? అది ఇండస్ట్రియల్ ల్యాండ్.. అంటూ ప్రశ్న లేవనెత్తారు. ఈ భూములకు ఆనుకొని ఉన్న హెచ్‌సీయూ స్థలంలో భారీ భవనాలు నిర్మించారని తెలిపారు. 4 హెలీప్యాడ్‌లు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో పాములు, నెమళ్లు, చెట్లు ఉన్నాయని తెలిపిన లాయర్.. పిటిషనర్ల వాదనల ప్రకారం ఆయా ప్రాంతాలను కూడా అటవీ భూములుగా ప్రకటించాల్సి ఉంటుందన్నారు. ఈ లెక్కన హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదంటూ ఏజీ వాదనలు వినిపించారు.


ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. "రేపటి వరకు ఎలాంటి చెట్లు నరకడం కానీ, ఎలాంటి పనులు గాని అక్కడ చేయొద్దు" అని తెలిపింది. ఈ విషయంపై మరింత సమాచారం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa