ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ముఖ్యమంత్రిని మార్చే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్,,,బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 11, 2025, 07:30 PM

తెలంగాణ ముఖ్యమంత్రిని మార్చే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్.. మంత్రి శ్రీధర్ బాబుకు ఉందని.. కానీ ఆయనకు ఉన్న ఆ ఒక్క లక్షణం లెకపోవటం వల్లే కాలేకపోతున్నాడని ఆరోపించారు. తాజాగా ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం (ఏప్రిల్ 11న) మీడియాతో మాట్లాడిన ధర్మపురి అర్వింద్.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు త్వరలోనే మారబోతున్నాయన్న సంకేతాలు ఇచ్చారు.


తెలంగాణలో ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోందని ధర్మపురి అర్వింద్ సంచలన ఆరోపణ చేశారు. ప్రస్తుతం ఉన్న నేతల్లో.. మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి పదవికి పూర్తిగా అర్హుడని అర్వింద్ అభిప్రాయపడ్డారు. కానీ.. ఆయన అక్రమ వసూళ్లు చేయలేడన్న ఒకే ఒక్క కారణంతో కారణంగా అధిష్ఠానం వెనకడుగు వేస్తోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో కొందరు నేతల్లాగా అధిష్ఠానానికి మూటలు పంపడం, అక్రమ మార్గాల్లో నిధులు సమకూర్చడం ఆయనకు తెలిసి ఉంటే, ఆయనే సీఎం అయ్యేవాడని కీలక ఆరోపణలు చేశారు. ధర్మపురి అర్వింద్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.


మంత్రి శ్రీధర్ బాబు పేరు ప్రస్తావించడమే కాదు, ఆయన నైతిక విలువలపై ప్రశంసలు చేస్తూనే, అదే కారణంగా ఆయన్ను అధిష్ఠానం పక్కకు నెట్టేస్తుందంటూ ధర్మపురి అర్వింద్ ఆరోపించటం గమనార్హం. పార్టీలో అక్రమంగా వసూళ్లు చేయడం, ఢిల్లీకి నిధులు పంపడం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఓ అర్హతగా మారిందని.. అది చేయలేకపోవడమే శ్రీధర్ బాబుకు ప్రతిబంధకంగా మారిందంటూ అర్వింద్ సంచలన ఆరోపణలు చేశారు.


మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డి‌ మీద కూడా ధర్మపురి అర్వింద్ తూటాలు పేల్చారు. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు రేవంత్ రెడ్డి సహకారమే ప్రధాన కారణమని ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై ప్రజలు పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయారని అర్వింద్ చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు ప్రజలు ఆయన్ను 'తురుంఖాన్‌'గా చూసినా.. ఇప్పుడు ఆయన నిజంగా 'జోకర్‌'గా మిగిలిపోయారంటూ ధర్మపురి అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పలు విమర్శలకు గురవుతున్న సమయంలో.. బీజేపీ నేత అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మపురి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ నేతలు ప్రదర్శిస్తున్న దూకుడును చూస్తుంటే.. త్వరలోనే తెలంగాణ రాజకీయాలు మరింత వేడిగా మారనున్నట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa