హైదరాబాద్ పాతబస్తీ మీదుగా ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు నిర్మిచంనున్న మార్గంలో పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆస్తుల సేకరణ ప్రారంభం కాగా.. పరిహారం చెల్లించిన నిర్మాణాలు కూల్చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజా రవాణలో మెట్రోది కీలక పాత్ర. ప్రతి నిత్యం దాదాపు 5 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం మూడు కారిడార్లు ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం, ఎంజీబీఎస్- జేబీఎస్ కారిడార్ల మధ్య మెట్రో పరుగులు పెడుతోంది. మెట్రో ట్రైన్లకు ఉన్న ఆదరణ దృష్ట్యా.. సెకండ్ ఫేజ్లో మరికొన్ని కారిడార్లు ప్రతిపాదించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశలో ప్రధానంగా ఐదు కారిడార్లు ఉంటాయి. వీటికి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుండి తుది అనుమతి రావాల్సి ఉంది.
సెకండ్ ఫేజ్లో గ్రీన్ లైన్ పొడిగింపు ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు పాతబస్తీ, ఫలక్నుమా మీదుగా నిర్మించనున్నారు. ఈ మార్గంలో దారుల్షిఫా జంక్షన్, షాలిబండ జంక్షన్, ఫలక్నుమాతో సహా 6 స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గం పనులు తాజాగా ప్రారంభమయ్యాయి. ఎంజీబీఎస్ వద్ద కూల్చివేత పనులు మెుదలు పెట్టారు. హైదరాబాద్ మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుండి చందరాయణగుట్ట వరకు నిర్మించనున్న మెట్రో లైన్ కోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 7.5 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ మార్గంలో దాదాపు 1100 ఆస్తులను గుర్తించారు. వీటిలో నివాస మరియు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఇప్పటివరకు 800 ఆస్తుల కోసం ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేశారు.
భూ యజమానులతో చర్చల అనంతరం చదరపు గజానికి రూ. 81,000, నిర్మాణాల విలువను పరిహారంగా చెల్లించడానికి అంగీకరించారు. ఇది కాకుండా, పునరావాస, పునస్థాపన చట్టం ప్రకారం అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తారు. ఇక రెండో దశలో మొత్తం 76.4 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లు విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 24,269 కోట్లుగా అంచనా. ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాలో నిర్మించాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తుంది. 2029 నాటికి ఈ మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa