రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీటుపీజీ క్యాంపస్లో. శనివారం (ఏప్రిల్ 12న) రోజున.. కేజీ టూ పీజీ క్యాంపస్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న దేవరాజు అనే ఉపాధ్యాయుడు.. ఒకటో తరగతి చదువుతున్న బాలుడిపై కర్కశంగా వ్యవహరించాడు. విద్యార్థి లవన్ సాయి కుమార్ తరగతి గదిలో అల్లరి చేస్తున్నాడని ఆగ్రహించిన ఉపాధ్యాయుడు దేవరాజు అతని వీపుపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో విపరీతంగా ఏడ్చిన లవన్.. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్లిన తర్వాత.. దుస్తులు మార్చే క్రమంలో కుమారుడి వీపు ఎరుపెక్కిపోయి.. వాతలు రావటాన్ని గమనించిన తల్లి ఒక్కసారిగా షాక్కు గురైంది. పిల్లాన్ని అడగితే.. సార్ కొట్టారంటూ చెప్పటంతో.. ఇదే విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు విషయం తెలియజేయడంతో వారంతా కలిసి పాఠశాలకు చేరుకున్నారు. అయితే, అప్పటికే పాఠశాల సమయం ముగియడంతో ఉపాధ్యాయుడు దేవరాజు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ ఘటనపై పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు రామచంద్రాన్ని పిల్లాడి కుటుంబ సభ్యులు నిలదీయగా.. ఉపాధ్యాయుడు దేవరాజు మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు. గతంలో కూడా ఇటువంటి ప్రవర్తన కనబరిచినట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని తక్షణమే విధుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మానసికస్థితి బాగోలేదని తెలిసినా.. పిల్లల పట్ల కర్కషంగా వ్యవహరిస్తున్నాడని తెలిసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితుడి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాయాలపాలైన బాలుడు లవన్ సాయి కుమార్ను మెరుగైన చికిత్స కోసం సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలని నేర్పించాల్సిన ఒక ఉపాధ్యాయుడు.. ఓపిక కోల్పోయి ఒకటో తరగతి విద్యార్థిపై ఇంత కర్కషంగా వ్యవహరించటంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎంత అల్లరి చేస్తే మాత్రం ఇంతలా కొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ఉపాధ్యాయునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa