పొదుపు సంఘాలు లేదా డ్వాక్రా గ్రూపు సంఘాల గురించి తెలియని వారు ఉండరు. అయితే చాలా మంది మహిళలకు ఈ సంఘాల్లో ఎలా చేరాలో తెలియదు. ఇప్పటికీ చాలా మంది మహిళలు ఎటువంటి స్వయం సహాయక సంఘాలలోనూ సభ్యులు కాలేదు. మహిళలు పొదుపు సంఘాలలో సభ్యులుగా చేరి ప్రభుత్వం అందించే వివిధ రకాల రాయితీలతో కూడిన రుణాలను పొందడం చాలా మందికి తెలియక వెనుకబడిపోతున్నారు. సొంతంగా ఎదిగే అవకాశం ఉన్నా.. సరైన అవగాహన లేక ఆర్థికంగా అభివృద్ధి చెందలేకపోతున్నారు. కొత్తగా సభ్యులుగా చేరడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళా సంఘాలలో సభ్యులుగా చేరడానికి కొన్ని ప్రాథమిక నిబంధనలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న మహిళకు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డులో పేర్కొన్న చిరునామా ఏ గ్రామం లేదా పట్టణంలో ఉంటే.. అదే ప్రాంతంలోని సంఘంలో సభ్యత్వం లభిస్తుంది. ఒకవేళ గతంలో ఏదైనా సంఘంలో సభ్యురాలిగా ఉండి, రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమైనా (డీఫాల్టర్ అయినా).. కొత్త సంఘాలలో సభ్యత్వం పొందడానికి అవకాశం ఉంటుంది.
18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు పొదుపు సంఘాలలో సభ్యులుగా చేరడానికి అర్హులు. అయితే ఇటీవల తెలంగాణ క్యాబినెట్ మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వానికి కనీస వయసును 18 ఏండ్ల నుంచి 15 ఏండ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా.. గరిష్ట వయసును 60 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచింది. ఇప్పటికీ ఏ పొదుపు సంఘంలోనూ సభ్యత్వం లేని మహిళలు కొత్తగా 10 మంది కలిసి ఒక స్వయం సహాయక సంఘంగా ఏర్పడవచ్చు. ఒకవేళ ఆ ప్రాంతంలో దివ్యాంగులు ఉంటే.. కేవలం ఐదుగురు సభ్యులతో కూడా ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
నేలపై కూర్చొని.. సామాన్యూడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం
కొత్తగా ఏర్పడిన సంఘంలోని సభ్యులందరూ కలిసి.. సంఘం పేరు మీద ఒక ఉమ్మడి బ్యాంకు ఖాతాను తెరవాలి. సంఘం కార్యకలాపాలు సజావుగా సాగడానికి సభ్యులందరూ కలిసి ఒక అధ్యక్షురాలిని.. ఒక కార్యదర్శిని ఎన్నుకోవాలి. అలాగే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత.. సంఘం లక్ష్యాలు, కార్యకలాపాల గురించి ఒక తీర్మానం ఆమోదించాలి. సంఘానికి ఒక ప్రత్యేకమైన పేరును నిర్ణయించాలి.
ఈ తీర్మానం కాపీని సంబంధిత బ్యాంకు మేనేజర్కు.. ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) కమ్యూనిటీ కోఆర్డినేటర్కు అందజేయాలి. పట్టణ ప్రాంతాల్లోని మహిళలు మెప్మా (మున్సిపల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) సిబ్బందిని కలిసి తీర్మాన ప్రతిని ఇవ్వాల్సి ఉంటుంది. సంఘం తీర్మానం ప్రకారం.. అధ్యక్షురాలు, కార్యదర్శి పేరు మీద బ్యాంకు లావాదేవీలు నిర్వహించబడతాయి.
కొత్తగా స్వయం సహాయక సంఘం ఏర్పాటు చేసుకున్న మహిళలకు.. వారి గ్రూపునకు కలిపి ప్రారంభంలో రూ. లక్ష నుండి రూ. 20 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే.. ఆరు నెలల తర్వాత ఇంకా ఎక్కువ మొత్తంలో రుణాలు కూడా మంజూరు చేస్తారు. ఈ స్వయం సహాయక సంఘాలు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి.. వారి స్వశక్తిని పెంచడానికి ఒక గొప్ప వేదికగా ఉపయోగపడతాయి. సరైన అవగాహన, సరైన మార్గదర్శకత్వంతో మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa