కాళేశ్వరంలో 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన సరస్వతీ నది పుష్కరాలు గత సోమవారం (మే 26) సాయంత్రం 4 గంటలకు శాస్త్రోక్తంగా ముగిశాయి. ఈ పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. పుష్కరాల ముగింపు అనంతరం ఆలయ అధికారులు హుండీలను లెక్కించగా, భారీగా ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.పుష్కరాలు ప్రారంభమైన మే 15వ తేదీ నుంచి ప్రతీరోజూ వేలాది మంది భక్తులు కాళేశ్వరానికి పోటెత్తారు. తొలి మూడు రోజులు వేలల్లో ఉన్న భక్తుల సంఖ్య, ఆ తర్వాత రోజుకు లక్షకు పైగా పెరిగింది. దీంతో త్రివేణి సంగమ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ పీఠాధిపతులు, స్వాములు ఈ పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానాలు చేశారు. ప్రత్యేక పూజలు, హోమాలతో కాళేశ్వర క్షేత్రం 12 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.పుష్కరాలు ముగిసిన తర్వాత సరస్వతి ఆలయంలోని పుష్కర హుండీలను, ఇతర హుండీలను ఆలయ సిబ్బంది లెక్కించారు. వరంగల్ సహాయ కమిషనర్ ఆర్. సునీత, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. మహేశ్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది.హుండీల పర్యవేక్షణాధికారి నందనం కవిత వెల్లడించిన వివరాల ప్రకారం, కాళేశ్వరం ఆలయానికి సరస్వతి పుష్కరాల 12 రోజులతో పాటు, మొత్తం 64 రోజుల కాలానికి హుండీల ద్వారా రూ.1,36,28,099 ఆదాయం వచ్చింది. దీనితో పాటు, పుష్కరాల సందర్భంగా గదుల కేటాయింపు ద్వారా రూ.1,71,000, హోమాల ద్వారా రూ.1,23,000, శీఘ్రదర్శనం టికెట్ల ద్వారా రూ.5,60,000, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,38,36,552 ఆదాయం లభించింది. వీటన్నింటినీ కలిపి, మొత్తం 12 రోజుల పుష్కరాల ద్వారా ఆలయానికి రూ.2,83,18,651 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.నగదుతో పాటు, భక్తులు కానుకగా సమర్పించిన 15 గ్రాముల మిశ్రమ బంగారం, 1 కిలో 750 గ్రాముల మిశ్రమ వెండి కూడా హుండీల ద్వారా లభించినట్లు నందనం కవిత వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa