ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేములవాడ రాజన్న ఆలయంలో కోడెలు మృతి.. అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 04:23 PM

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మరణమృదంగం కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్యం, సరైన నిర్వహణ లేకపోవడంతో మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. శుక్రవారం 8 కోడెలు మరణించగా.. శనివారం మరో 6 కోడెలు మృత్యువాతపడ్డాయి. దీంతో కేవలం రెండు రోజుల్లోనే 14 మొక్కు కోడెలు మృతిచెందడం భక్తుల్లో, ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


రాజన్న భక్తులు తమ మొక్కులు తీరితే స్వామివారికి కోడెలను సమర్పించుకోవడం ఆనవాయితీ. ఈ కోడెలను ఆలయ అధికారులు తిప్పాపూర్‌ గోశాలలో సంరక్షిస్తుంటారు. గత కొన్నేళ్లుగా అవసరమైన రైతులకు ఈ కోడెలను అందజేస్తూ వస్తున్నారు. అయితే.. ఆరు నెలల క్రితం కోడెల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఒకే వ్యక్తికి 60 జీవాలు అందించడం వివాదాస్పదం కావడంతో పంపిణీ ప్రక్రియను నిలిపివేశారు. దీంతో గోశాలకు భక్తులు సమర్పించే కోడెల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోయింది. వాస్తవానికి ఈ గోశాల 400 నుంచి 500 కోడెలను సంరక్షించే సామర్థ్యం కలిగి ఉండగా.. ప్రస్తుతం 1,250కి పైగా కోడెలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సామర్థ్యానికి మించిన జీవాలను నిర్వహించలేకపోవడం, సరైన ఆవాసం, ఆహారం లేకపోవడమే ఈ మరణాలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. నిత్యం కేవలం 400 కోడెలకు మాత్రమే పచ్చి గడ్డి అందిస్తున్నట్లు సమాచారం.


కోడెల మరణాలపై జిల్లా కలెక్టర్ సందీప్‌ కుమార్‌ ఝా తీవ్రంగా స్పందించారు. సిరిసిల్ల వెటర్నరీ వైద్య బృందాన్ని వేములవాడ గోశాలకు వెళ్లి పశువైద్య శిబిరం నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో గోశాలకు చేరుకున్న అంజిరెడ్డి వైద్య బృందం, కోడెలను పరీక్షించి ప్రాథమిక నివేదికను వెల్లడించింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోశాల అంతా బురదమయం కావడం, దీంతో కోడెల మధ్య తొక్కిసలాట జరిగి మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనారోగ్యంగా ఉన్నవాటికి వైద్యం అందిస్తూ, పరిస్థితిని పూర్తిగా సమీక్షించి కలెక్టర్‌కు నివేదిక ఇస్తామని వైద్య బృందం తెలిపింది.


గోశాలలో నిత్యం పదుల సంఖ్యలో కోడెలు మృతి చెందుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కుబడిగా సమర్పించిన జీవాలను సంరక్షించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa