తెలంగాణ పాలిటిక్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం హాట్ టాఫిక్గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఇష్యూ అంతా ఒక ఫ్యామిలీ డ్రామా అని తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ జరుగుతోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చార్పత్తా ఆట నడుస్తోందని విమర్శించారు. కవిత, కేటీఆర్, సంతోష్, హరీష్ రావు చార్ పత్తా అయితే.. కేసీఆర్ జోకర్ అని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల సినిమాకు కాంగ్రెస్ ప్రొడక్షన్ చేస్తోందని ఆరోపించారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడూ కలవవని బండి సంజయ్ స్పష్టం చేశారు. కవిత అరెస్టును ఆపడానికి బీజేపీతో కలిసేందుకు ప్రయత్నించినప్పుడు తాము దగ్గరికి రానివ్వలేదని చెప్పారు. కవిత రాసిన లేఖ కాంగ్రెస్ డైరెక్షన్లో జరిగిన డ్రామా అని.. బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని, కుటుంబ పార్టీ అని, అందుకే తాము వారిని దగ్గరికి రానివ్వమని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్డుకున్నా బీజేపీ ప్రస్థానం ఆగదని.. తెలంగాణ సమాజం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోందని బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం నిధులు ఇచ్చిందని.. అభివృద్ధి పనుల కోసం తెలంగాణకు రెండు లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. వరి, ఇతర పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని గుర్తుచేశారు. కాంగ్రెస్ వంద రోజులలో తమ ఆరు గ్యారంటీలను అటకెక్కించిందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు అడిగినప్పుడల్లా టాపిక్ డైవర్ట్ చేస్తోందని మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, వరి ధాన్యానికి బోనస్ ఇస్తానని చెప్పి సన్న ధాన్యంకే బోనస్ ఇస్తుందని విమర్శించారు. గత పద్దెనిమిది నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం, ఫార్ములా కేసు, డ్రగ్స్ కేసుల వంటివి పత్తా లేకుండా పోయాయని ఆరోపించారు. మూటలు తీసుకెళ్లి ఢిల్లీకి కప్పం కడుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు. ఇక రాజన్న దేవస్థానంలో కోడెలను రక్షించాల్సిన బాధ్యత దేవస్థానానిదేనని, కోడెలను రక్షించడానికి సరైన ప్రణాళికలు రూపొందించాలని, కోడెలు ఉంచే గదుల సంఖ్యలను పెంచాలని సూచించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులను కించపరిచే విధంగా ఉన్నాయని.. ఆర్మీ చీఫ్ మీద వారికి విశ్వాసం లేదా అని ప్రశ్నించారు. పహల్గాం సంఘటన జరిగిన పదిహేను రోజులలోనే ఉగ్రవాదులను హతమార్చామని, ఉగ్రవాదం అంతమయ్యే వరకు యుద్ధం కొనసాగుతుందని, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa