ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెడ్ల అబ్బాయిని చేసుకుంటావని ఆ అమ్మాయికి 25 ఏళ్ల క్రితమే చెప్పిన: సీఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 07:56 PM

హైదరాబాద్ హైటెక్స్‌లో శనివారం సాయంత్రం 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024' ప్రదానోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. సినీ సెలబ్రెటీలకు అవార్డులు ప్రదానం చేశారు. నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు, ఉత్తమ నటుడిగా సార్ట్ హీరో అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్, ఉత్తమ దర్శకుడిగా నాగ్‌అశ్విన్‌లు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు అనంతరం మాట్లాడిన సీఎం.. హైదరాబాద్ నగరాన్ని హాలీవుడ్, బాలీవుడ్‌ సినిమా పరిశ్రమకు అడ్డాగా మార్చడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న 2047 విజన్ డాక్యుమెంట్‌లో సినీ పరిశ్రమ రాణించడానికి నిర్దేశిత లక్ష్యాలతో ఒక చాప్టర్ ఉండాలని, అందుకు సినీ ప్రముఖులు అవసరమైన ప్రణాళికను తయారు చేయాలని కోరారు.


2047 నాటికి తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, వచ్చే 10 ఏళ్ల నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించాలంటే సినీ పరిశ్రమ కూడా అభివృద్ధి సాధించాలన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించారు. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ రెడ్ల అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని తాను 25 ఏళ్ల క్రితమే చెప్పినట్లు గుర్తుచేశారు. తాను చెప్పింది చెప్పినట్లు జరిగిందన్నారు. తాను చెప్పింది ఇంత వరకు ఏదీ మిస్ కాలేదని అన్నారు.


'నేను చెప్పింది ఏదీ మిస్ కాలేదు. నేను ఆలోచన చేసింది.. నేను సాధించాలనుకున్నది ఏదీ ఫెయిల్ కాలేదు. నా సక్సెస్ రేషియా 100 పర్సెంట్. అంతెందుకు అశ్వినీదత్ గారి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి స్కూలు, కాలేజీకి పోయేటప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయితో నవ్వుతూ అనేవాడిని నువ్వు రెడ్ల అబ్బాయినే పెళ్లి చేసుకుంటావని.. సరిగ్గా రెడ్ల అబ్బాయినే పెళ్లి చేసుకుంది. 20-25 ఏళ్ల క్రితమే ఆ అమ్మాయికి చెప్పిన. సో నేను ఒకసారి చెప్పిన అంటే 100 పర్సెంట్ అది జరిగి తీరుతుంది. తెలంగాణ కూడా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధిస్తుంది.' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.


కాగా, అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ డెరెక్టర్ నాగ్ అశ్విన్ రెడ్డిని 2015లో ప్రేమ వివాహం చేసుకుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన 'యాదోంకి భారత్' అనే షార్ట్ ఫిల్మ్‌ని ప్రియాంక దత్ నిర్మించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని హీరోగా నటించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రాన్ని ప్రియాంక నిర్మించింది. అనంతరం 2015లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa