ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.449 కోట్లతో నిర్మాణం....దక్షిణ భారతదేశంలోనే తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్

national |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 11:25 PM

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ట్రాఫిక్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మీడియా, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే బెంగళూరు ట్రాఫిక్‌ను తగ్గించేందుకు.. అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. నగరంలో మెట్రోలను మరింత వేగంగా విస్తరించడంతోపాటు.. మరిన్ని ఫ్లైఓవర్లు, అండర్ గ్రౌండ్ రోడ్లు.. టన్నెల్ రోడ్లు నిర్మిస్తోంది. అయినప్పటికీ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు గాంచిన బెంగళూరులో ట్రాఫిక్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మన దేశంలో దక్షిణ భారతదేశంలోనే తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను బెంగళూరులో నిర్మిస్తున్నారు. అయితే దీని ప్రారంభం మరింత ఆలస్యం కావడంతో.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఈ రాగిగుడ్డ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ .. రెండవ ఆర్మ్ ప్రారంభం మరింత ఆలస్యమైంది. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్-ఎలక్ట్రానిక్స్ సిటీ కారిడార్‌కు ప్రయాణించే వాహనదారులకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్)మరోసారి నిరాశను మిగిల్చింది. రూ. 449 కోట్లతో నిర్మించిన ఈ రాగిగుడ్డ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయినా.. దాన్ని 2026 జనవరి చివరి నాటికి ప్రారంభిస్తామని బీఎంఆర్‌సీఎల్ ప్రకటించింది. 2025 డిసెంబర్‌లోనే ప్రారంభిస్తామని గతంలోనే హామీ ఇచ్చినా అది జరగలేదు. మరోవైపు.. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం ఆలస్యం అవుతుండగా.. స్థానికులు తమ పన్నుల డబ్బు వృథా కాకుండా ఉండేందుకు.. ఈ మూసివేసిన ఫ్లైఓవర్‌ను మార్నింగ్ జాగింగ్ ట్రాక్‌గా మార్చుకోవడం గమనార్హం.


5 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయి.. నెల రోజులు అయినట్లు తెలుస్తున్నప్పటికీ.. దాన్ని వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు బీఎంఆర్‌సీఎల్ ప్రకటించింది. ఈ ఫ్లైఓవర్ మొదటి ఆర్మ్ (రాగిగుడ్డ నుంచి హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ వైపు) 2024 జూలైలోనే ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ కారణంగా సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ భారీగా తగ్గింది.


ఈ ఆలస్యంపై బెంగళూరు నగరవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అత్యవసరం అయిన ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ పూర్తి అయినప్పటికీ.. నిరుపయోగంగా ఉండటం వల్ల.. పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథా అవుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. బెంగళూరులో వాహనాలు లేని అరుదైన రన్నింగ్ ట్రాక్‌గా ఈ ఫ్లైఓవర్ మారిందని పలువురు సెటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ గత కొన్ని సంవత్సరాలుగా సిద్ధంగా ఉన్నా.. దానికి యాక్సెస్ ర్యాంప్ మాత్రం సిద్ధం కాలేదని.. అందుకే తాము కట్టిన పన్నులను ఉపయోగించుకోవడానికి దానిపై పరిగెడుతున్నామని స్థానికులు పేర్కొంటున్నారు.


రాగిగుడ్డ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం ఆలస్యం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. బీఎంఆర్‌సీల్ అధికారులు స్పందించారు. ఈ ఫ్లైఓవర్ దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని.. 2026 జనవరి చివరి నాటికి ఫ్లైఓవర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. హెచ్‌ఎస్‌ఆర్, పరప్పన అగ్రహార వైపులా భారీ ట్రాఫిక్ ఉండటం.. పని గంటలపై ఉన్న ఆంక్షలు పనులను ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు అని వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa