ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం.. తందూరీ వంటకాలపై నిషేధం

national |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 11:23 PM

ప్రస్తుత శీతాకాలంలో దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఢిల్లీలో కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు రేఖా గుప్తా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు.. కేంద్ర ప్రభుత్వం అనేక కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ.. గాలి నాణ్యత మాత్రం మెరుగుపడటం లేదు. ఈ నేపథ్యంలో రోజురోజుకూ మరిన్ని కఠినమైన ఆంక్షలను ప్రవేశపెడుతున్నారు. ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుండటంతో డిసెంబర్ 9వ తేదీన బొగ్గు, కట్టెలతో తయారు చేసే బహిరంగ తందూరీలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.


హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ తినుబండారాల్లో బొగ్గు, కట్టెలతో పనిచేసే ఓపెన్ తందూర్‌లను పూర్తిగా నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం అమలులోకి రావడంతో.. ఆయా హోటళ్లు ఎప్పటి నుంచో తయారు చేస్తున్న వంటకాల తయారీ కోసం ప్రత్యామ్నాయ వంట పద్ధతుల (ఎలక్ట్రిక్ లేదా గ్యాస్ తందూర్‌లు) వైపు అడుగులు వేస్తున్నాయి.


ఈ నిర్ణయంతో ఢిల్లీలోని హోటళ్లు, రెస్టారెంట్లు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. లోధి కాలనీలోని ఎంఐ ఫుడ్ సెంటర్‌లో.. తందూరీ వంటకాలే ప్రధానంగా విక్రయిస్తారు. ఇప్పుడు తందూరీపై నిషేధం విధిస్తే.. తాము హోటల్ మెనూ మొత్తం మార్చాల్సిందేనని నిర్వాహకులు తెలిపారు. కస్టమర్‌లు ఆ పొగ రుచిని ఆశించే తమ హోటల్‌కు వస్తారని.. రాత్రికి రాత్రే దాన్ని మార్చేయడం అంత సులభం కాదని పేర్కొన్నారు.


మాల్వియా నగర్‌లోని ఒబెరాయ్ దాబా మాత్రం.. ఢిల్లీ నగరంలో కలుషితమైన గాలి పెరిగిపోతున్న దృష్ట్యా ఈ మార్పు చాలా అవసరమని పేర్కొంది. ఈ నిర్ణయం కష్టమే అయినప్పటికీ.. చాలా ముఖ్యమని తెలిపింది. ఈ సమస్య పరిష్కారం కనుగొంటామని.. ఒబెరాయ్ దాబా ఓనర్ అశోక్ అన్నారు. బొగ్గు వాడకాన్ని ఆపడం వల్ల ఢిల్లీ గాలి కొంచెమైనా మెరుగుపడితే.. ఢిల్లీవాసులుగా, వ్యాపారులుగా తామే సహకరించాలని పేర్కొన్నారు. బొగ్గు, కట్టెలకు బదులు.. ప్రత్యామ్నాయ గ్రిల్స్‌తో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల కొన్ని వంటకాల రుచి కొద్దిగా మారవచ్చని.. అది పెద్ద సమస్య కాదని చెప్పారు.


తందూరీ వంటకాలపై నిషేధం విధించడం.. ఢిల్లీలోని ఇరుకైన ప్రాంతాల్లో నడిచే చిన్న చిన్న హోటళ్లకు ఇది పెద్ద దెబ్బగా మారుతుందని వారు పేర్కొటున్నారు. జామా మసీద్ సమీపంలోని అస్లాం కిచెన్‌లో.. తందూరీ వంటకాలను తమ మెనూ నుంచి పూర్తిగా తొలగించాల్సి వస్తుందేమోనని దాని ఓనర్ షాదాబ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


కొన్ని హోటళ్లు మెనూ మార్పులకు బదులుగా.. తందూరీ బట్టీల డిజైన్‌లో మార్పులు చేయాలని భావిస్తున్నాయి. తమ వంట విధానాన్ని మార్చేందుకు కట్టెలు, బొగ్గుతో ఉపయోగించే తందూరీ బట్టీ కాకుండా.. ఎలక్ట్రిక్ లేదా గ్యాస్ తందూర్‌ను ఉపయోగించే విధంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని నార్త్ ఢిల్లీలోని ఒక ప్రముఖ డైనింగ్ మేనేజర్ విశేష్ నిజావాన్ చెప్పారు. ఇది తమకు అదనపు ఖర్చు, ఫుడ్ రుచిలో మార్పు తీసుకువస్తుందని.. కానీ తమకు అంతకుమించి వేరే మార్గం లేదని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa