తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం.. రాష్ట్ర రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రింటింగ్ దశలో ఉన్న రేషన్ కార్డులు సిద్ధమయ్యాక భౌతికంగా లబ్ధిదారులకు అందజేస్తామని.. అప్పటి వరకు రేషన్ కార్డు నంబర్తో పాటు కుటుంబ వివరాలు లబ్ధిదారుల జాబితాలో చేరుస్తామని తెలిపారు. వీరందరికీ వచ్చే నెల నుంచి రేషన్ బియ్యం అందుతాయని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే మూడు నెలల రేషన్ పంపిణీ చేసిన ప్రభుత్వం సెప్టెంబర్ నెల నుంచి కొత్తగా రేషన్ పంపిణీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదని.. కేవలం ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పంపిణీ చేశారని ఆయన గత ప్రభుత్వాన్ని విమర్శించారు.
తమ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. అదనంగా 95 లక్షల కొత్త కార్డులు ఇవ్వబోతున్నామని వివరించారు. దీంతో పాత, కొత్త కార్డులతో కలిపి మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల 10 లక్షలకు చేరుతుందని తెలిపారు. ఏడాదికి రూ.13 వేల కోట్లు వ్యయం చేస్తూ ప్రతి లబ్ధిదారుడికి నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇంత భారీ స్థాయిలో.. నాణ్యమైన సన్నబియ్యంతో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం దేశంలోనే తెలంగాణలో ప్రథమం అని, ఇంతకంటే గొప్ప సంక్షేమ పథకం మరెక్కడా ఉండదని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్ బియ్యం ప్రజలు తినేవారు కాదని విమర్శించారు.
కొత్త రేషన్ కార్డుల మోడల్ ఖరారైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి మూడు రంగులతో కూడిన కార్డు, ఎగువన ఉన్న వారికి గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇది పారదర్శకతను పెంచడంతో పాటు, లబ్ధిదారుల వర్గీకరణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇంతటి సార్థకత ఉన్న ఈ కార్యక్రమంపై ప్రతిపక్షాలు రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వం, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో వెనుకడుగు వేయదని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa