ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరిగిన రింగ్ రైలు ప్రాజెక్ట్ వ్యయం.. ఏకంగా రూ.28 వేల కోట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 07:16 PM

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ నిర్మించ తలపెట్టిన ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. ప్రారంభంలో దీని నిర్మాణానికి రూ.12,408 కోట్లు ఖర్చువుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు దాన్ని భారీగా పెంచారు. తాజాగా ప్రచురించిన కొత్త నివేదికలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.28 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని తెలిపారు. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ కోసం 60 మీటర్ల వెడల్పుతో 3,600 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. ఆర్ఆర్ఆర్ పక్కనే ఈ ఔటర్ రింగ్ రైలును నిర్మించాలని భావిస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్‌లో రవాణా మరింత సులభతరం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికులకు, సరుకు రవాణాకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.


రీజినల్ రింగ్ రోడ్డు కంటే ఔటర్ రింగ్ రైలు ఎత్తుగా ఉంటుంది. రింగ్ రోడ్డును 5 మీటర్ల ఎత్తులో నిర్మించారు. దీనికి బయట ఔటర్ రింగ్ రైలును మరో 1.5 మీటర్ల ఎత్తులో నిర్మిస్తారు. అంటే భూమి నుంచి చూస్తే ఔటర్ రైల్వే లైన్ 6.5 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఒకేసారి రెండు రైల్వే లైన్లను నిర్మించనున్నారు. భవిష్యత్తులో మరిన్ని లైన్లు అవసరమైతే వాటిని నిర్మించడం కోసం కొంత స్థలాన్ని వదిలిపెడతారు. దీని కోసం 60 మీటర్ల వెడల్పుతో అలైన్‌మెంట్ రెడీ చేయనున్నారు.


ఔటర్ రింగ్ రైలు ఆరు చోట్ల ఇతర రైల్వే లైన్లను కలుస్తుంది. దీని కోసం ఆరు చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలు నిర్మిస్తారు. ఈ వంతెనలు ఇంటర్ ఛేంజ్ లైన్లుగా పని చేయనున్నాయి. అంటే ఈ 6 లైన్ల నుంచి ఔటర్ రింగ్ రైలుకు కనెక్షన్ ఉంటుంది. వీటి ద్వారా రైళ్లు అటూ ఇటూ మారడానికి వీలుగా ఉంటుంది. ఇందుకోసం క్రాసింగ్‌కు 5 కిమీ దూరం నుంచి మెట్రో రైలు తరహాలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. అలాగే ఔటర్ రింగ్ రైల్ కోసం 26-30 కొత్త స్టేషన్లను నిర్మించాల్సి ఉంటంది. ఔటర్ రింగ్ రైలు పక్కనే రింగ్ రోడ్డు ఉన్నందున.. స్టేషన్ భవనాలను కూడా మెట్రో రైలు తరహాలోనే నిర్మిస్తారు. దీనికి సంబంధించిన డిజైన్లు త్వరలో సిద్ధం చేస్తారు.


ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు రైళ్లలో రోజుకు 4 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణాలు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రైలు అందుబాటులోకి వచ్చిన ఐదారేళ్లలో ఈ సంఖ్య 9 లక్షలకు చేరుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. అదనపు రూట్ అందుబాటులోకి రావడం వల్ల, లైన్ల అనుసంధానం వల్ల రైళ్ల సంఖ్య కూడా బాగా పెరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా రోజుకు 130 సరుకు రవాణా రైళ్లు తిరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రైలు అందుబాటులోకి వచ్చిన ఐదారేళ్లలో ఆ రైళ్ల సంఖ్య 250కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa