ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామాన్ని ముంచెత్తిన వరద.. హెలికాప్టర్ సాయం కోసం ఎదురు చూస్తోన్న గ్రామస్తులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 07:20 PM

గత నాలుగైదు రోజులుగా కాస్త తెరిపి ఇచ్చిన వరుణుడు నేడు మళ్లీ విరుచుకుపడ్డాడు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బుధవారం నాడు వర్షం కురిసింది. అయితే హైదరాబాద్, మెదక్ జిల్లాలో మాత్రం కుండపోత వర్షం కురిసింది. నేడు ఈ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు, చెరువులు పొంగి పోర్లాయి. రోడ్లు కొట్టుకుపోయి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక భారీ వర్షాల కారణంగా మెదల్ జిల్లాలోని ఓ తండా పూర్తిగా నీట మునిగింది.


మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా హావేలిఘనపూర్ మండలంలోని ధూప్‌సింగ్ తండా పూర్తిగా వరదలో మునిగిపోయింది. తండాలోని ఇళ్లన్ని నీట ముగినిపోయాయి. దీంతో తండా వాసులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇళ్ల మీదకు ఎక్కి.. సాయం కోసం ఎదురు చూడసాగారు. కాపాడాలని ఆర్తనాదాలు చేయసాగారు. తండా మొత్తం మునిగిపోవడంతో.. కాపాడే మార్గాలు మూసుకుపోయాయి. దీంతో తండావాసులు హెలికాప్టర్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.


  భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లాలోని హవేలిఘనపూర్‌లో పెద్ద చెరువు కట్ట తెగింది. పసుపులేరు వాగు కూడా పొంగి పోర్లుతుంది. కామారెడ్డి జిల్లా రాజంపేటలో 40 సెం.మీల వర్షపాతం నమోదు కావడంతో ఆ ప్రభావం మెదక్‌ జిల్లాపై పడింది. ఇక నేడు కురిసిన భారీ వర్షాల కారణంగా రామాయంపేట పట్టణం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. రామాయంపేట పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. అలానే మెదక్ పట్టణంలోని బృందావన్, సాయి నగర్, తారకరామనగర్ కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. భారీ వర్షాల వల్ల రామాయంపేట నుంచి సిద్దిపేట మార్గంలో నేషనల్ హైవే మీద రాకపోకలు నిలిచిపోయాయి.


హవేలిఘనపూర్ మండలంలోని నక్కవాగులోకి ఒక కారు కొట్టుకుపోయింది. దీంతో కారులు ఉన్న వారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం కారులో చిక్కుకున్న వారిని కాపాడటం కోసంరంగంలోకి దిగింది. అలానే రాజపేట వాగు వద్ద ఆటో కొట్టుకుపోయింది. ఇద్దరు వ్యక్తులు చెట్టు పట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలానే మంజీరా నదిలో ఓ మహిళ గల్లంతయ్యింది.


భారీ వర్షాల కారణంగా.. నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫాంలోకి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో దానిలో ఉన్న 10 వేల కోళ్లు మృతి చెందడంతో.. సుమారు రూ.14 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఫౌల్ట్రీ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. అలానే నార్సింగిలోని మరో ఫౌల్ట్రీ ఫాంలోకి ఆకస్మికంగా వరద చేరడంతో.. 1000 కోళ్లు మృతిచెందాయి. ఇక మెదక్ జిల్లాలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్, నియోజకవర్గ ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa