మన న్యాయవ్యవస్థ గురించి తరచుగా ఓ మాట వినిపిస్తు ఉంటుంది. మన దేశంలో న్యాయ ప్రక్రియ ఆలస్యం కావొచ్చేమో కానీ.. న్యాయం మాత్రం కచ్చితంగా జరుగుతుంది అని చెబుతారు. తాజాగా ఓ వ్యక్తి అంశంలో ఇదే నిజమయ్యింది. కారు పార్కింగ్ కోసం అతను ఏకంగా 20 ఏళ్ల నుంచి పోరాటం చేస్తుండగా.. తాజాగా అతడికి న్యాయం జరిగింది. హైదరాబాద్లో ఈ సంఘటన వెలుగు చూసింది.
హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి తనకు కేటాయించాల్సిన కారు పార్కింగ్ స్థలం కోసం గత 20 ఏళ్లుగా కోర్టులో పోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించాడు. ఈకేసులో బాధితుడికి.. ప్రతివాది కారు పార్కింగ్కు బదులుగా రూ.10 లక్షలు చెల్లించాడు. సదరు బాధితుడికి జాతీయ స్థాయిలో కూడా అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో కొన్ని రోజుల క్రితమే రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఈ పిటిషన్ను ముగించింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రైవేటు ఉద్యోగి అయిన శివరావు అనే వ్యక్తి.. 2008లో కారు పార్కింగ్ విషయమై కేసు దాఖలు చేశాడు.
తాజాగా ఈ కేసులో అతడు విజయం సాధించాడు. 2006లో శివరావు మలేషియన్ టౌన్షిప్ వారి రెయిన్ ట్రీ పార్క్ అపార్ట్మెంట్లోని ఏ బ్లాక్ లో ఒక ప్లాటు కొనుగోలు చేశాడు. దీంతో పాటుగా కారు పార్కింగ్ కోసం కూడా విడిగా డబ్బులు చెల్లించినప్పటికీ.. అతడికి పైపులు లీకయ్యే చోట.. ఇరుగ్గా అసౌకర్యంగా ఉన్న ప్రాంతంలో పార్కింగ్ను కేటాయించారు. పార్కింగ్ ప్లేస్ తనకు సౌకర్యవంతంగా లేదని.. మార్చాలని అనేక సార్లు నిర్వాహకులను కోరినా వారు శివరావును అభ్యర్థనను పట్టించుకోలేదు.
దీంతో శివరావు 2008 లో రంగారెడ్డి వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ ఫైల్ చేశాడు. అయితే మూడేళ్ల తర్వాత అనగా 2011, ఏప్రిల్ 21న జిల్లా కమిషన్ శివరావుకు అనకూలంగా తీర్పు వెల్లడించింది. దీంతో ప్రతివాది దీని గురించి రాష్ట్ర కమిషన్లో అప్పీలు చేశారు. దీంతో 2013 అక్టోబర్ 11న రూ.10 వేల జరిమానా విధిస్తూ అప్పీలు కొట్టివేశారు. స్టేట్ కమిషన్ తీర్పు తర్వాత 2014లో తీర్పు అమలు పిటీషన్ దాఖలు చేయడంతో.. అది వాయిదా పడుతూ వచ్చి సుమారు 11 ఏళ్లు నడిచి ఈ ఏడాది ఆగస్టు 11న ముగిసింది. శివరావుకు ప్రస్తుతం కారు పార్కింగ్ కేటాయించే అవకాశం లేనందున అందుకు బదులుగా ప్రతివాది రూ.10 లక్షలు చెల్లించేందుకు అంగీకరించడమే కాక ఆ డబ్బును శివరావు ఖాతాలో జమ చేశారు.
ఈ సందర్భంగా శివరావు మాట్లాడుతూ.. నాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతోనే ఇన్నాళ్లు ఎదురు చూశాను. అలానే మన న్యాయస్థానాలపై నమ్మకం ఉంచి పోరాడాను. చివరకు విజయం సాధించాను. న్యాయవ్యవస్థ మీద నేను పెట్టుకున్ననమ్మకం వమ్ము కాలేదు. నాకు జరిగిన అన్యాయానికి 20 ఏళ్ల తర్వాత విజయం సాధించాను. న్యాయస్థానాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa