ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాదాపు 12కిపైగా డిపోల నుంచి..పండగలాంటి వార్త తెచ్చిన టీజీఎస్ఆర్టీసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 07:13 PM

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పండగ లాంటి వార్త చెప్పింది. హుస్సేన్‌సాగర్‌లో జరిగే నిమజ్జన వేడుకలను వీక్షించేందుకు ప్రతి సంవత్సరం నగరం నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు తరలి వస్తారు. ఈ భారీ జనసంచారం దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్‌ రీజియన్, చార్మినార్‌ డివిజన్‌ పరిధిలోని కాచిగూడ, బర్కత్‌పుర, ముషీరాబాద్, ఫలక్‌నుమా, మెహిదీపట్నం, రాజేంద్రనగర్‌ డిపోలు నుంచి బస్సులు నడపాలని నిర్ణయించారు.


అదేవిధంగా హయత్‌నగర్‌ డివిజన్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్‌–1, 2, మిథాని డిపోల నుండి కూడా ప్రత్యేక వాహన సౌకర్యం కల్పించనున్నారు. ఈ వివరాలను హైదరాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ సుధా పరిమళ వెల్లడించారు. ఆ బస్సులు ఉదయం నుంచి అర్థరాత్రి వరకు రాకపోకలు సాగిస్తాయని మేనేజర్ తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని నగర ప్రజలు ఉపయోగించుకోవాాలని సూచించారు.


ఆర్టీసీతో పాటు పోలీసులు, ట్రాఫిక్‌ శాఖలు కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో మొత్తం 43 మంది డ్రైవర్లు, మెకానిక్‌లు ప్రత్యేకంగా నియమించబడి ముగ్గురు ఏసీపీలు, నాలుగు పోలీస్‌ స్టేషన్ల ఆధ్వర్యంలో పని చేయనున్నారు. ఊరేగింపుల సమయంలో ఎక్కడైనా బస్సులు లేదా వాహనాలు నిలిచిపోయిన సందర్భంలో వెంటనే మరమ్మతులు చేసి, రవాణా వ్యవస్థ నిరాటంకంగా సాగేటట్లు చూసే బాధ్యత వారిపై ఉంటుంది.


ప్రధాన మార్గాల్లో ప్రత్యేక బస్సుల రాకపోకలు ఉంటాయి. కాచిగూడ, రాంనగర్‌ నుంచి బషీర్‌బాగ్‌ వరకు, కొత్తపేట, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, మిథాని నుంచి ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వరకు, జామై ఉస్మానియా నుంచి ఇందిరా పార్క్‌ వరకు, గచ్చిబౌలి–లింగంపల్లి–రాజేంద్రనగర్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు, పటాన్‌చెరు నుంచి లింగంపల్లి వరకు, ఆఫ్జల్‌గంజ్‌ నుంచి ఆలిండియా రేడియో వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా.. గణేశ్‌ నిమజ్జన సమయంలో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గుముఖం పడతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించి వేడుకలను ఆస్వాదించగలరని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa