హైదరాబాద్లో సెప్టెంబరు 6న జరగనున్న గణేశ్ మహా నిమజ్జన వేడుకల కోసం పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ మేరకు దాదాపు 29 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.గడిచిన నెల రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ తెలిపారు. నిమజ్జన ఊరేగింపు ప్రధాన మార్గమైన బాలాపూర్ రూట్ను స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు. ఊరేగింపు వాహనాలకు చెట్లు, విద్యుత్ వైర్లు అడ్డు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించినట్లు వివరించారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.బందోబస్తు కోసం నగరంలోని 20 వేల మంది పోలీసులతో పాటు, ఇతర జిల్లాల నుంచి 9 వేల మంది సిబ్బందిని రప్పిస్తున్నట్లు సీపీ ఆనంద్ పేర్కొన్నారు. వీరికి అదనంగా కేంద్ర బలగాలు కూడా సహకరిస్తాయని తెలిపారు. ఇదే సమయంలో సెప్టెంబర్ 6న మిలాద్ ఉన్ నబి ఊరేగింపు, 14న మరో ర్యాలీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన కూడా ఉన్నాయని, వాటన్నిటికీ పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. నగరంలోని సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని, అక్కడ క్రైమ్ టీమ్స్ నిరంతరం గస్తీ కాస్తాయని చెప్పారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలను పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉండగా, నగరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఏళ్ల తరబడి నిమజ్జనాలు జరుగుతున్న ట్యాంక్ బండ్పై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆరోపించింది. దీనివల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేసింది. గత 45 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని గౌరవించి, యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో భక్తులతో కలిసి ఆందోళన చేపడతామని సమితి హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa